'ప్రేమవంతెన' పురానాపూల్ కి పునర్వైభవం!

ABN , First Publish Date - 2021-11-27T00:38:23+05:30 IST

దర్శకుడు శేఖర్ కమ్ముల తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'లవ్ స్టోరి'లో ప్రేమికులకి పురానాపూల్ సెంటిమెంట్ ఎక్కించాడు: ఆ పురానాపూల్ వంతెనని నడుస్తూ దాటిన జంటల ప్రేమ సక్సెస్ అవుతుందంటూ ఓ సీన్ పెట్టేశాడు...

'ప్రేమవంతెన' పురానాపూల్ కి పునర్వైభవం!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'లవ్ స్టోరి'లో ప్రేమికులకి పురానాపూల్ సెంటిమెంట్ ఎక్కించాడు: ఆ పురానాపూల్  వంతెనని నడుస్తూ దాటిన జంటల ప్రేమ సక్సెస్ అవుతుందంటూ ఓ సీన్ పెట్టేశాడు. దాంతో పురానాపూల్ దగ్గర ప్రేమికుల సందడి పెరిగినా, దాని మీద ట్రాఫిక్కు, రాకపోకలు నిషేధించబడటం వల్ల వారి  ఆశలు అడయాసలవుతున్నాయి. 


పురానాపూల్ వంతెన పగుళ్లు రావడం, గత అక్టోబర్ లో కురిసిన భారీ వర్షాల వల్ల వంతెన ఇంకా దెబ్బతినడంతో దాన్ని తాత్కాలికంగా మూసేశారు.అయితే, పురానాపూల్ కి పునర్వైభవం తెచ్చే ప్రయత్నాలు మొదలవుతున్నాయని మునిసిపల్ ఎడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలెప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. పురానాపూల్ దుస్థితి మీద ఒక పౌరుడు ట్విటర్ లో పోస్టు చేసిన ఫొటోలకు ఆయన అదే ట్విటర్ వేదికగా స్పందించారు. ఎంతో చారిత్రక ప్రాథాన్యత ఉన్న ఆ వంతెనకి పాత వైభవం తీసుకురానున్నట్లు తెలిపారు.వంతెన మీద దురాక్రమణలని తొలిగింపు, రోడ్లు వేయించడంతో సహా పురానాపూల్ ని అన్నివిధాలా సరిచేసి అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.


గోల్కొండ రాజధానిగా పరిపాలన చేస్తున్న సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్‌ షా ఈ వంతెనని 1578లో కట్టాడు. యవరాజు మహమ్మద్ కూలీ కుతుబ్ షా ప్రేమించిన భాగ్యమతి  ముచికుందా నది అంటే ఇప్పటి మూసీనదికి అవతలవైపు గోల్కొండకి 10 మైళ్ల దూరంలోని చించలం (నేటి శాలిబండ) అనే చిన్న పల్లెటూరులో ఉండేది. ఆమెను కలుసుకొనేందుకు యువరాజు రోజూ పడవలో మూసీనదిని దాటి వెళుతుండటం గమనించిన సుల్తాన్ ఇబ్రహీం కూలీ కుతుబ్‌ షా, కొడుకు ప్రేమ కోసం ఈ వంతెనను కట్టించాడట. ఇది ఇద్దరు ప్రేమికుల కోసం కట్టిన వంతెన కావడంతో దీనికి ‘ప్యార్ ఆన పూల్’ అనే పేరుండేదని, అదే క్రమంగా పురానాపూల్‌గా మారిందని చెబుతారు. 600 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పుతో 22 ఆర్చిలతో గొప్పగా నిర్మించిన ఈ పురానాపూల్ త్వరలో మళ్లీ ‘ప్యార్ ఆన పూల్’ కాబోతుందన్నమాట!



Updated Date - 2021-11-27T00:38:23+05:30 IST