వాటితో మమేకమవుదాం!

ABN , First Publish Date - 2022-03-18T05:30:00+05:30 IST

ఈ ప్రపంచంలో మనకు లభించిన కానుకల్లో అన్నిటి కన్నా గొప్పది... మానవ జీవితం. మనం తీసుకొనే ప్రతి శ్వాస ఆ భగవంతుడి ఆశీర్వాదం. ఈ విషయాన్ని....

వాటితో మమేకమవుదాం!

ఈ ప్రపంచంలో మనకు లభించిన కానుకల్లో అన్నిటి కన్నా గొప్పది... మానవ జీవితం. మనం తీసుకొనే ప్రతి శ్వాస ఆ భగవంతుడి ఆశీర్వాదం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మన జీవితాలను ఆనందమయం ఎలా చేసుకోవాలో ఆలోచించాలి.


ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఒక పెద్ద నగరానికి వెళ్ళి, బాగా డబ్బు సంపాదించాలనే కోరిక అతనికి ఉండేది. అతను ఒక రోజు తన భార్యకు తన కోరికను వెల్లడించాడు. డబ్బు సంపాదించి తిరిగి వస్తానని చెప్పాడు. అప్పుడు ఆమె నాలుగు లడ్డూలను తయారు చేసిందది. ఒక్కొక్క దానిలో... అతనికి తెలియకుండా... ఒక్కొక్క బంగారు నాణెం పెట్టింది. వాటిని అతనికి ఇస్తూ... ‘‘ఈ లడ్డూలను ఊరకే తినేయకండి. మీకు విపరీతంగా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే వాటిని తినండి’’ అని చెప్పింది.


అతను ‘అలాగే’ అని తల ఊపి బయలుదేరాడు. నగరం వైపు వెళ్తూండగా... మార్గమధ్యంలో అతనికి ఆకలివేసింది. లడ్డూలను తిందామనుకున్నాడు. కానీ, ‘ప్రస్తుతం నాకు మరీ అంత ఆకలిగా అనిపించడం లేదు. బాగా ఆకలి వేసినప్పుడు కదా వీటిని తినాల్సింది’ అనుకొని... పక్కనే ఉన్న చెట్ల పండ్లను కోసుకొని తిన్నాడు. ప్రయాణం కొనసాగించాడు.


నగరానికి చేరుకున్నాక అతనికి ఏ పనీ దొరకలేదు. ఏ వ్యాపారం కుదరలేదు. దిక్కు తోచక... అయోమయ స్థితిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. ఆకలి వేసిన ప్రతిసారీ ఆ లడ్డూల వైపు చూసి ‘ఇవి అత్యవసరం కోసం కదా... నాకింకా అంత దుస్థితేం రాలేదు’ అనుకొనేవాడు.

ఇలా అనుకుంటూ ఉండగానే చాలా రోజులు గడచిపోయాయి. అతను ఆ లడ్డూలను ముట్టుకోనైనా లేదు. నగరానికి వెళ్ళి కూడా అతనేం చెయ్యలేకపోయాడు. ఆకలి వేసిన ప్రతిసారీ లడ్డూలను చూసి ‘వీటికింకా సమయం రాలేదు’ అనుకుంటూ గడిపాడు. అతను అలా పేదవాడిగానే ఉండిపోయాడు. చివరకు ఒకరోజు ఆకలితో అలమటించి, అలమటించి మరణించాడు.


ఈ కథ ఎవరిది? మనందరిదీ!

ఎందుకంటే భగవంతుడు మనలో ఒకటి దాచి ఉంచాడు. అదే శాంతి. మనలోకి మనం ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ప్రవేశించి... ఆ శాంతిని అనుభూతి పొందవచ్చు. పైన చెప్పిన కథలో... ఆ వ్యక్తి భార్య లడ్డూలలో బంగారు నాణేలను పెట్టింది. అతను ఏ ఒక్క లడ్డూను తీసుకొని తిని ఉన్నా... అతని దరిద్రం తీరిపోయేది. అతను ఐశ్వర్యవంతుడు కాగలిగేవాడు. అదే విధంగా మనలో కూడా భగవంతుడు ‘ఆనందం’ అనే నాణేలను ఉంచాడు. కానీ, మనం ఆ ఆనందానుభూతిని పొందలేకపోతున్నాం. పైగా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాం.


మీలో నడిచే శ్వాస విలువ ఏమిటో గుర్తించండి. ఆ భగవంతుడు మీ మీద చూపిన అపారమైన కృపను గుర్తించండి. అలా గుర్తించినప్పుడు... ఆనంద ద్వారాలన్నీ మీ కోసం తెరుచుకుంటాయి. ఈ జీవితం మీకు లభించిన కారణం... ‘ఆనందం’ అనే రంగులో మమేకం అయిపోవడానికే!  మీ జీవితాన్ని ‘శాంతి’ అనే రంగులో రంగరించండి. సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడపండి.


ప్రేమ్‌ రావత్‌ 

Updated Date - 2022-03-18T05:30:00+05:30 IST