కడెం ప్రాజెక్టుకు పూర్వవైభవం
ABN , First Publish Date - 2022-08-20T07:15:08+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు తిరిగి పూర్వవైభవం సంతరించుకోవడం శుభ సూచకమని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావులు అన్నారు.
ఖానాపూర్, ఆగస్టు 19 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు తిరిగి పూర్వవైభవం సంతరించుకోవడం శుభ సూచకమని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావులు అన్నారు. శుక్రవారం కడెం ఎడమకాలువ ద్వారా ఆయ కట్టుకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం కడెం ఆయకట్టు రైతాంగానికి అండగా ఉంటుందన్నారు. ఒక దశలో వస్తున్న వరద నీటి ధాటికి ప్రాజెక్టు నిలవడం కష్టమేనని భావించిన తరుణంలో భగవంతుడే కడెం ప్రాజెక్టును కాపాడాడని వారన్నారు. ఖరీఫ్ సాగు కష్టమేనని అంతా భావించామని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించి ఖరీఫ్ పంట సాగుకు నీటిని అందించేలా చర్యలు చేపట్టడ హర్షనీయమన్నారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 300ల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రమేపి నీటివిడుదల శాతాన్ని పెంచుతామన్నారు. ఈ కార్య క్రమంలో ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ అలెగ్జాండర్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్, నీటి పారుదల శాఖ ఎస్ఈ సునీల్ కుమార్, ఈఈ రాజశేఖర్, గౌడ్, డి.భోజదాస్, తదితరులున్నారు.