ప్రశాంతంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష
ABN , First Publish Date - 2022-08-08T06:11:26+05:30 IST
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర పోలీస్ నియామక మండలి ద్వారా పోలీస్ ఉద్యోగాల నియామకాలకు జిల్లాలోని సిరిసిల్ల, అగ్రహారంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సిరిసిల్ల క్రైం, ఆగస్టు 7: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర పోలీస్ నియామక మండలి ద్వారా పోలీస్ ఉద్యోగాల నియామకాలకు జిల్లాలోని సిరిసిల్ల, అగ్రహారంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. 2684 మంది అభ్యర్థులకు 2513 మంది హాజరయ్యారు. దాదాపు 93.6శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 9 గంటల వరకే అభ్యర్థులు చేరుకున్నారు. చాలా మంది అభ్యర్థులు ఫొటో లేక తిరిగి వెళ్లి తీసుకొని వచ్చారు. రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రాజు అనే అభ్యర్థి పరీక్షా కేంద్రం వద్దకు ఫొటో లేకుండా సరిగ్గా ఉదయం 10 గంటలకు రావడంతో అధికారులు తిప్పి పంపారు. పరీక్ష కేంద్రం వద్ద వంద మీటర్ల దూరం వరకు భారీ కేడ్లు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచారు. పరీక్ష ప్రారంభానికి ముందే సిరిసిల్ల పట్టణంలోని మహతీ, అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, రీజినల్ కో ఆర్డినేటర్ విజయ్కుమార్, సీఐలు ఉన్నారు.