గర్భిణి పావని అంత్యక్రియల విషయంలో విచారకర పరిస్థితులు

ABN , First Publish Date - 2021-05-16T15:50:26+05:30 IST

సకాలంలో వైద్య సహాయం అందక మరణించిన గర్భిణి పావని

గర్భిణి పావని అంత్యక్రియల విషయంలో విచారకర పరిస్థితులు

హైదరాబాద్/నాచారం : సకాలంలో వైద్య సహాయం అందక మరణించిన గర్భిణి పావని అంత్యక్రియల విషయంలో కూడా విచారకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పావని గర్భంలో మృతశిశువు ఉంది. తల్లీబిడ్డను వేరు చేస్తేనే అంత్యక్రియలు చేస్తామని శ్మశానం సిబ్బంది పట్టుబట్టారు. శుక్రవారం మల్లాపూర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు పావని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లీని బిడ్డను వేరు చేస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పడంతో మృతదేహాన్ని కుటుంబీకులు వెనెక్కి తీసుకెళ్లారు. 


శనివారం పావని మృతదేహం నుంచి బిడ్డను వేరుచేసి శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. దీంతో పావని మృతదేహానికి దహన సంస్కారాలను నిర్వాహకులు పూర్తిచేశారు. మృతశిశును పూడ్చిపెట్టారు. పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గర్భిణిని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కొవిడ్‌ అనుమానంతో చేర్చుకోలేదని, అందుకే తల్లీబిడ్డ మృతి చెందారని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-16T15:50:26+05:30 IST