గర్భిణికి కొవిడ్.. చికిత్స ఆలస్యంతో మృతి
ABN , First Publish Date - 2021-05-15T08:08:38+05:30 IST
కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణికి సకాలంలో చికిత్సనందించి ప్రాణం కాపాడాల్సిన ఆస్పత్రి వైద్యులు, అసలు అడ్మిట్ చేసుకునేందుకే తిరస్కరించడంతో ఆమె మృతిచెందింది.
పలు ఆస్పత్రులు తిరిగినా చేర్చుకోని వైద్యులు
మంగళ్హాట్, మే 14(ఆంధ్రజ్యోతి): కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణికి సకాలంలో చికిత్సనందించి ప్రాణం కాపాడాల్సిన ఆస్పత్రి వైద్యులు, అసలు అడ్మిట్ చేసుకునేందుకే తిరస్కరించడంతో ఆమె మృతిచెందింది. బాధితురాలిని వైద్యం కోసం పలు ఆస్పత్రులకు తీసుకెళ్లామని, ఎక్కడా చేర్చుకోలేదని.. చికిత్స ఆలస్యం అవడంతోనే ఆమె కన్నుమూసిందని బంధువులు ఆరోపించారు. నాచారం మల్లాపూర్ నాగలక్ష్మి కాలనీకి చెందిన తిరుపతి రావు, పావని భార్యాభర్తలు. పావని తొమ్మిది నెలల గర్భవతి. ఇటీవల ఆమెకు జ్వరంతో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. శుక్రవారం ఉదయం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు కొవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ అడ్మిట్ చేసుకోలేదు. మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. చివరికి ఎల్బీనగర్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించేలోపే ఆమె మృతి చెందింది.