ఎంత పని చేశావ్‌ ‘అమ్మా’..!

ABN , First Publish Date - 2022-01-07T08:05:08+05:30 IST

తొలి కాన్పుల్లో ఆడపిల్ల.. ఇప్పుడా చిన్నారికి రెండేళ్లు. మళ్లీ ఆ తల్లి గర్భం దాల్చింది. గురువారం కాన్పు చేసేందుకు వైద్యులు సమయం కూడా ఇచ్చారు. కానీ, ఆ నిండు

ఎంత పని చేశావ్‌ ‘అమ్మా’..!

  • ’ఆడపిల్ల పుడుతుందేమోనని నిండు గర్భిణి ఆత్మహత్య
  • డెలివరీ ముందు రోజు అఘాయిత్యం
  • పోస్టుమార్టంలో మగ శిశువు మృతదేహం వెలికితీత
  • మంచిర్యాలలో హృదయ విదారక ఘటన


మంచిర్యాల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తొలి కాన్పుల్లో ఆడపిల్ల.. ఇప్పుడా చిన్నారికి రెండేళ్లు. మళ్లీ ఆ తల్లి గర్భం దాల్చింది. గురువారం కాన్పు చేసేందుకు వైద్యులు సమయం కూడా ఇచ్చారు. కానీ, ఆ నిండు గర్భిణికి మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనన్న భయం పట్టుకుంది. ఇందుకు బంధువైన ఓ వైద్యుడి తప్పుడు సమాచారం కూడా తోడైంది. తెల్లవారితే తనకు మళ్లీ పాపే పుడుతుందని.. అత్తింటివారు, బంధువుల ఆరళ్లను తట్టుకోవడం కష్టమని భావించింది. మనోవేదనతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. కొద్ది గంటల్లో శిశువుకు ప్రాణం పోయాల్సిన ఆ తల్లి.. తన నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇక్కడ అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే.. బలవన్మరణం చెందిన ఆ మాతృమూర్తి గర్భంలో మగ శిశువు ఉన్నాడు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం రాత్రి మంచిర్యాలలో చోటుచేసుకుంది. జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన పులిశెట్టి గంగన్న-శ్యామల రెండో కూతురు రమ్య (26)ను 2017లోమంచిర్యాలకు చెందిన ఎగ్గెన ఆనంద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి రెండేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. 9 నెలల గర్భిణి అయిన రమ్యకు వైద్యులు గురువారం డెలివరీకి సమయం ఇచ్చారు. తెల్లవారితే కాన్పు ఉండడంతో మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని భావించిన రమ్య బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు వెలికితీశారు. ఆడపిల్ల పుడుతుందనుకొని ఆత్మహత్య చేసుకున్నదని, గర్భంలో మగబిడ్డ ఉన్నదని తెలిస్తే తమకు కడుపుకోత మిగిల్చేది కాదని తల్లిదండ్రులు బోరున విలపించారు. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తప్పుడు సమాచారంతోనే..!

’కడుపులో ఉన్న శిశువు ఆడా, మగా అని చెప్పడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ మంచిర్యాలకు చెందిన ఓ వైద్యుడు రమ్యకు పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తోంది. మృతురాలికి బంధువైన వైద్యుడు ఆడపిల్ల పుడుతుందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించిన ఆ వైద్యుడు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నట్లయింది. వైద్యుడిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

Updated Date - 2022-01-07T08:05:08+05:30 IST