పైనాపిల్ బాంబుతో ఏనుగును చంపిన ఘటనపై ఎఫ్ఐఆర్
ABN , First Publish Date - 2020-06-03T20:06:27+05:30 IST
మలప్పురం: బాణాసంచాతో ఏనుగును చంపిన ఘటనపై కేరళ పోలీసులు స్పందించారు.
మలప్పురం: బాణాసంచాతో ఏనుగును చంపిన ఘటనపై కేరళ పోలీసులు స్పందించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మన్నర్క్కడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహన్ కృష్ణన్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
కేరళ మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలో గర్భంతో ఉన్న ఏనుగు ఆహారం కోసం ఊళ్లోకి వచ్చింది. కొందరు వ్యక్తులు బాణసంచా కూర్చిన పైనాపిల్ను నోటికి అందించారు. ఏనుగు ఆశగా దాన్ని కొరకగానే నోట్లో పేలిపోయింది. భరించలేని బాధతో ఊరంతా పరుగులు పెట్టిన ఆ ఏనుగు.. పక్కనే ఉన్న వెల్లియార్ నదిలోకి వెళ్లింది. కొద్దిసేపటికి అక్కడే అలా నదిలో నిలబడే ప్రాణాలు వదిలింది. గ్రామస్థులెవరికీ హాని చేయని ఆ ఏనుగు కొందరు ఆకతాయిలు చేసిన పనికి బలైంది.
ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఏనుగును పొట్టనపెట్టుకున్నవారిని కఠినంగా శిక్షించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.