పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2022-01-21T05:29:47+05:30 IST
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారావు డిమాండ్ చేశారు.
- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారావు
నంద్యాల(నూనెపల్లె), జనవరి 20: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారావు డిమాండ్ చేశారు. జాక్టో ఆధ్వర్యంలో గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ పాత హెచ్ఆర్ఏ శ్లాబ్లను కొనసాగించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, పెన్షనర్లకు క్వాం టమ్ పెన్షన్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ పుల్లారెడ్డి, విజయరావు, నరసింహులు, హనుమంతు, గిల్డ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ అశోక్రెడ్డి, చెన్నుడు పాల్గొన్నారు.
చాగలమర్రి: రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ జీవోలను రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు శివశంకర్, పెద్దవంగలి ప్రసాద్, అంబటి రాజశేఖర్రెడ్డి, జయరాజు అన్నారు. గురువారం చాగలమర్రి గ్రామంలోని ఎస్టీయూ కార్యాలయం నుంచి మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మునయ్యల ఆధ్వర్యంలో వివిధ వాహనాల్లో కర్నూలులో జరిగే కలెక్టరేట్ ముట్టడికి తరలివెళ్లారు. అంతకముందు కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ, రహదారిపై ధర్నా నిర్వహించారు. కర్నూలుకు వెళ్తున్న ఎస్టీయూ నాయకులను పాణ్యం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సంఘ నాయకులు అక్కడే జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు శేషాద్రి, సుబ్బారావు, అబ్దుల్ఖాదర్, శ్రీనాథ్రెడ్డి, సురేషప్ప, నరసింహులు, మహబూబ్బాషా, ఉస్మాన్, శాస్త్రీ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పాణ్యం: రాష్ట్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా కర్నూలుకు వెళ్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులను గురువారం స్థానిక డొంగు వద్ద పాణ్యం ఎస్ఐ సుధాకర్రెడ్డి, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలకు దోబీ, వాచ్మెన్, వంట మనిషి, డ్రైవర్, వాహనం వంటి సౌకర్యాలు ఉచితంగా అనుభవిస్తుండడంతో ఉద్యోగులు భారమైన పెట్రోల్, డీజిల్, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నిత్యావసరాల ధరలు వంటి సమస్యలు కానరావన్నారు. 2018లో లేని ఇబ్బందులు ఇప్పుడే వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నడిచేది ఉద్యోగులతోనేనన్నది సీఎం గమనించాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులను మధ్యాహ్నం వరకు నిలిపి వేసి అనంతరం విడిచి పెట్టారు. కార్యక్రమంలో నాయకులు వెంకటరామిరెడ్డి, శివశంకర్, ప్రతాపరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్ఖాదర్, రాజయ్య, సంజీవరెడ్డి, మునెయ్య, రవీంద్రారెడ్డి, వెంకటేశ్వరరె డ్డి, శ్రీదర్రెడ్డి, శాస్త్రి, శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడి గృహ నిర్బంధం
బనగానపల్లె: బనగానపల్లె పట్టణానికి చెందిన ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవస్వామిని పోలీసులు గురువారం ఉదయం గృహ నిర్బంధం చేశారు. ఫ్యాప్టో పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డగించారు. అనంతరం వాహనాల్లో వెళ్తుండగా బేతంచెర్ల, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఏపీటీఎఫ్ నాయకులు వెళ్లకుండా నిర్బంధించినట్లు మాధవస్వామి తెలిపారు. హక్కుల కోసం పోరాడుతున్న తమపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సమంజసం కాదని అన్నారు.