పీఆర్సీ భిక్ష కాదు.. హక్కు
ABN , First Publish Date - 2021-12-06T06:12:44+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తామని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వీసీహెచ్ వెంగళ్ రెడ్డి, ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి అన్నారు.
- ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళనలు
- రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు
- ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సమర భేరి
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 5: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తామని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వీసీహెచ్ వెంగళ్ రెడ్డి, ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని పొదుపు భవనంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీఆర్సీ భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని అన్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేని అయోమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని, దీని వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. జీపీఎస్ రూపంలో ఉద్యోగులు దాచుకున్న రూ.1600 కోట్లు ప్రభుత్వం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐసీ లోన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8 నెలల నుంచి మంజూరు కావడం లేదని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోందని, ఇక వేచి చూసే తీరిక ఉద్యోగులకు లేదని అన్నారు. పెన్షన్ విధానం ఉద్యోగుల జీవన్మరణ సమస్య అన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఆందోళనలు చేపడతాయని ప్రకటించారు. డిసెంబరు 7 నుంచి 10వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగ ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని కోరారు. 10వ తేదీన నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన సమయంలో డెమో నిర్వహించాలని సూచించారు. 13న అన్ని పాత తాలుకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. 16న అన్ని పాత తాలుకా కేంద్రాల్లో ధర్నాలు, 21న జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోశాధికారి వీఎం వెంకటేశ్వర్లు, ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకే ప్రకాష్రావు, జిల్లా విద్యాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బలరామిరెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మద్దిలేటి, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న, ఏపీ ఎన్జీవోస్ నగర అధ్యక్షుడు కాశన్న, ఆర్యూపీపీ జిల్లా అధ్య క్షుడు నాగేంద్రుడు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవస్వామి, ఇస్మాయిల్, ఏపీటీఎఫ్ రామక్రిష్ణ, ఆప్టా జిల్లా అధ్యక్షుడు సేవ్య నాయక్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఎంటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఏపీ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ శంకర్రా వు, బలరామ్, నాయుడు, సాంబశివారెడ్డి, లక్ష్మీనారాయణ, ఆర్అం డ్బీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ. రమణ పాల్గొన్నారు.