కరోనాను జయించిన ఉమ్మడి కుటుంబం
ABN , First Publish Date - 2021-05-13T17:39:39+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ యూపీలోని ప్రయాగ్రాజ్ను కూడా వణికిస్తోంది.
ప్రయాగ్రాజ్: కరోనా సెకెండ్ వేవ్ యూపీలోని ప్రయాగ్రాజ్ను కూడా వణికిస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన పలువురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి భిన్నంగా ఇదే ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 26 మంది కరోనాను ఓడించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రసాద్ మిశ్రా కుటుంబానికి చెందిన 26 మంది ఒక్కొక్కరుగా కరోనా బారిన పడ్డారు. అయితే వీరంతా కరోనాపై విజయం సాధించి, కరోనా బాధితులతో ధైర్యాన్ని నింపుతున్నారు. ఆజాద్ నగర్ నివాసి రాఘవేంద్ర మిశ్రా చిన్న కుమారుడు ఏప్రిల్ 11 న కరోనా బారిన పడ్డాడు.
ఆ తరువాత కుటుంబంలో 26 మంది సభ్యులకు కూడా కరోనా సోకింది. ఉమ్మడి కుటుంబం కావడంతో వారి ఇంటిలో మొత్తం 31 మంది ఉన్నారు. పది రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలోని 26 మంది సభ్యులకు కరోనా సోకింది. వీరి ఇంట్లోని 87 ఏళ్ల వృద్ధుడు రాఘవేంద్ర మిశ్రా కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఇంట్లోని వారంతా ఆందోళన పడ్డారు. రాఘవేంద్ర మిశ్రా 2012లో తన కుమారునికి కిడ్నీ దానం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మిశ్రా కుమారుడు రవీంద్ర మిశ్రా మాట్లాడుతూ కరోనా బారిన పడిన తామంతా డాక్టర్ సలహా మేరకు ఔషధాలు వాడామని, క్రమంతప్పకుండా యోగా చేయడం, ఆవిరి పట్టడం, కషాయాలను, పసుపు పాలను కూడా తాగామని చెప్పారు. ప్రస్తుతం తమ ఇంట్లోనివారంతా కరోనా నుంచి బయటపడ్డామని తెలిపారు.