అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి.. మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత బయటపడ్డ భార్య నిజస్వరూపం.. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2022-04-22T20:18:21+05:30 IST
అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అనంతరం అతడు తన అమ్మమ్మ ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అనుమానాస్పద రీతిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: అతడికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అనంతరం అతడు తన అమ్మమ్మ ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అనుమానాస్పద రీతిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మరణానికి సంబంధించిన కారణాలను తొలుత కుటుంబ సభ్యులు ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత అతడి భర్య నిజస్వరూపం బయటపడటంతో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్(డీఎం) ను ఆశ్రయించారు. ప్రాథమిక విచారణ అనంతరం డీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్రాజ్ అనే వ్యక్తికి పింకీ అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట రామ్రాజ్ అమ్మమ్మ ఇంట్లో కాపురం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణ వార్తను పింకీ ఫోన్ చేసి చెప్పడంతో అక్కడకు చేరుకున్న రామ్రాజ్ కుటుంబ సభ్యులు.. భావోద్వేగంలో ఏ విషయాన్ని పట్టించుకోకుండా మృతదేహాన్ని సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. అనంతరం పింకీ వ్యవహార శైలిపై వారికి అనుమానం కలిగింది. సోను అనే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందనే విషయాన్ని రామ్రాజ్ కుటుంబ సభ్యులు గుర్తించారు.
ప్రియుడి సహాయంతో తన భర్తను పింకీనే చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామ్రాజ్ సోదరుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ను ఆశ్రయించాడు. పంకీ అక్రమ సంబంధానికి సంబంధించిన సాక్ష్యాలను చూపించాడు. వాటిని పరిశీలించిన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. రామ్రాజ్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికి తీసి, పోస్ట్మార్టం నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో గురువారం రోజు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని సమాధిలోంచి తీసి, పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రామ్రాజ్ది హత్యే అని తేలితే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.