జనం మెచ్చిన నేత మోదీ... తక్కువగా అంచనా వేయం : ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2021-04-12T20:16:18+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్

జనం మెచ్చిన నేత మోదీ... తక్కువగా అంచనా వేయం : ప్రశాంత్ కిశోర్

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలు మెచ్చిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు. రాజకీయ యవనికపై ప్రత్యర్థులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దని, తానుకూడా తక్కువగా అంచనా వేయనని పేర్కొన్నారు. ఎవరితో అయితే రాజకీయంగా తలపడతానో, వారి శక్తిని ఎక్కువగా అంచనా వేసే రంగంలోకి దిగుతానని వివరించారు. ఓ జాతీయ ఛానల్‌కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్య వైరల్ అయిన ఆడియో టేప్ గురించి కూడా స్పందించారు. ఆడియో టేపుల్లో ఉన్నట్లు తాను వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. ఆ ఆడియోలో లీక్ కావడం అంటూ ఏమీ లేదని, అదంతా బహిరంగమే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లను దాటలేదని మరోసారి పునరుద్ఘాటించారు. తిరిగి తృణమూల్ కాంగ్రెస్సే బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


కేంద్ర బలగాలనుద్దేశించి సీఎం మమత నేరుగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని అన్నారు. తప్పులు జరుగుతున్నాయి కాబట్టే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని పీకే చెప్పుకొచ్చారు. కోచ్‌బిహార్‌లో కేంద్ర బలగాలు కాల్పులకు దిగడంతోనే ఐదుగురు మృతి చెందారని, అంతేకానీ సీఎం మమత ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేని స్పష్టం చేశారు. ఒకవేళ ఓటు వేసే క్రమంలో మహిళల్ని అడ్డుకుంటే, కేంద్ర బలగాలను ఘోరావ్ చేయాలని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లి సందర్శించడం సీఎం మమత హక్కు అని స్పష్టం చేశారు. 2014 లో పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారని, మరుసటి రోజే ప్రధాని మోదీ వారిని కలిశారని గుర్తు చేశారు. కానీ అప్పుడు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మాత్రం ఘటనా స్థలానికి వెళ్లకుండా సీఎం మమతను అడ్డుకుంటున్నారని పీకే ఆక్షేపించారు. పేద ప్రజలతో సీఎం మమత సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా మంచి నేత అని, అయితే సీఎం మాత్రం మమతాయేనని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-04-12T20:16:18+05:30 IST