బెంగాల్‌‌లో బీజేపీపై పీకే చేసిన నాటి ట్వీట్ వైరల్!

ABN , First Publish Date - 2021-05-02T23:42:39+05:30 IST

గతేడాది డిసెంబరు 21న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పలు విడతలుగా

బెంగాల్‌‌లో బీజేపీపై పీకే చేసిన నాటి ట్వీట్ వైరల్!

కోల్‌కతా: గతేడాది డిసెంబరు 21న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పలు విడతలుగా బెంగాల్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలను బట్టి చూస్తే మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు మమత సిద్ధమవుతున్నారు. మరోవైపు 200 స్థానాల్లో విజయం సాధిస్తామని ఎన్నికలకు ముందు ఢంకా బజాయించి చెప్పిన బీజేపీ రెండంకెల స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం 77 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.


బెంగాల్ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్, బీజేపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ గతేడాది డిసెంబరు 21న ఓ ట్వీట్ చేస్తూ బెంగాల్‌లో బీజేపీ మూడంకెల స్థానాలను సాధించలేదని, రెండంకెల స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ కనుక వందకు మించి స్థానాలు సాధిస్తే తాను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అంతేకాదు, ఈ ట్వీట్‌ను సేవ్ చేసుకోవాలని కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బీజేపీ వందలోపు స్థానాలకే పరిమితం కావడంతో పీకే ఆనాడు చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-05-02T23:42:39+05:30 IST