‘పీకే’సేదెవరినో?

ABN , First Publish Date - 2022-06-15T04:57:56+05:30 IST

ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం

‘పీకే’సేదెవరినో?

  • టీఆర్‌ఎస్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ సర్వే కలవరం
  • పలువురు సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత 
  • ఆందోళనలో కొందరు సిట్టింగ్‌లు
  • తాము సైతం బరిలోనేనంటున్న ‘సీనియర్లు’ 
  • టికెట్‌ ఇవ్వకుంటే పక్కదారేనంటూ సంకేతాలు


ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం కేడర్‌కు సంకేతాలు పంపడంతో రాజకీయాలు హీటెక్కాయి.  గెలుపు గుర్రాలకే మళ్లీ టికెట్‌ ఇస్తామని, ప్రజల్లో మంచి పేరు లేని వారిని పక్కనపెడతామని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం సిట్టింగ్‌లను హెచ్చరించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగ్‌లపై సర్వేలు మొదలుపెట్టింది. దీంతో కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లాప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీరందరికీ మళ్లీ టికెట్‌ వచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. వీరిలో కొందరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా.. మరికొందరిపై ప్రజల్లో కూడా మోహం మొత్తింది. సుదీర్ఘకాలంగా స్థానిక ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండడంతో సహజంగానే ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ నిర్వహించే సర్వేల్లో ప్రజావ్యతిరేకత ఎక్కువ ఉన్నవారిని పక్కనపెట్టాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. సర్వేలో ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తేలితే సీనియర్‌ నేతలనైనా  నిస్వార్ధంగా పక్కన పెట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై సిట్టింగ్‌ ఎమ్మెల్యేందరికీ టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం సంకేతాలు పంపింది. ఇప్పటికే పీకే టీమ్‌ సర్వేలు మొదలు పెట్టడంతో సిట్టింగ్‌ల్లో ఆందోళన మొదలైంది. సర్వేల్లో వెనుకబడకుండా నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం 7గంటలకే కొందరు ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో అయిదారుగురు సిట్టింగ్‌లపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ఇదే వ్యతిరేకత కొనసాగితే వారిని తప్పించి కొత్తవారికి టికెట్లు ఇవ్వడం ఖాయమంటున్నారు. 


మేము సైతం...

ఇదిలాఉంటే సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఎక్కువ ఉన్నచోట్ల ఈసారి తమకు అవకాశం దక్కుతుందని కొందరు నేతలు ఆశపడుతున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వస్తే తాము కూడా బరిలో నిలవాలని కొందరు సీనియర్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కొందరు ఎమ్మెల్యేలుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆరునూరైనా తాండూరు నుంచి బరిలో దిగుతానని ఇప్పటికే అనేకమార్లు బహిరంగంగా ప్రకటించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మరో ఎమ్మెల్సీ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అలాగే చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎంపీ సీటు నిరాకరిస్తే తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. ఆయన రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి స్థానాలపై కన్నేసినట్లు తెలిసింది. ఇక మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కూడా రాజేంద్రనగర్‌ నుంచి పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం కూడా టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి సైతం టికెట్‌ రేస్‌లో ఉన్నారు. 


వారి దారెటు?

ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న కొందరు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు తమకు అవకాశం దక్కకుంటే ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  మంత్రి సబితారెడ్డి ఈసారి కూడా అక్కడే నుంచే బరిలో దిగనున్నారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన అనంతరం అధికార టీఆర్‌ఎ్‌సలో చేరి మంత్రివర్గంలో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడ నుంచే పోటీచేయనున్నారు. దీంతో గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓటమి చెందిన తీగల కృష్ణారెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకరంగా ఉంది. మళ్లీ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయం కావడంతో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చేవెళ్ల టికెట్‌ మళ్లీ యాదయ్యకే ఇస్తే ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తమకు టికెట్లు రాకుంటే జట్టుకట్టి మూకుమ్మడిగా ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన కూడా కొందరు చేస్తున్నారు. ఈమేరకు ఇద్దరు ముగ్గురు సీనియర్లు తరచూ ఇతర పార్టీలు, తటస్థులతో రహస్యమంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలే కాంగ్రె్‌సకు రాజీనామా చేసి తటస్థంగా ఉంటున్న ఓ నేతతో కలిసి వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే సదరు నేత బీజేపీవైపు మొగ్గుచూపుతుండగా.. మిగతా నేతలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం చర్చలకే పరిమితమైన వీరి ఆలోచన కార్యరూపం దాలిస్తే టీఆర్‌ఎ్‌సకు ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Updated Date - 2022-06-15T04:57:56+05:30 IST