బాలికకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2021-10-28T04:13:16+05:30 IST
కొండాపురం మండలం రామానుజాపురంలో సామూహిక అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని న్యాయ పోరాట కమితిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
కావలి, అక్టోబరు 27: కొండాపురం మండలం రామానుజాపురంలో సామూహిక అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని న్యాయ పోరాట కమితిటీ సభ్యులు పేర్కొన్నారు. బాధిత బాలికకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం ఆర్డీవో కార్యాలయం ముందు బైటాయించి ధర్నా చేశారు. అనంతరం న్యాయపోరాట కమిటీ కన్వీనర్ పీ. అంబేద్కర్, కో కన్వీనర్లు సీ. శారద, ఎండీ అలీంలు మాట్లాడుతూ అత్యాచారం జరిగిన బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకోకుండా పోలీసులు రాసుకున్న స్టేట్మెంట్పై ఆ బాలికతో సంతకం చేయించి కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితురాలిని బెదిరించి సంఘటనను తప్పుదోవ పట్టించే విధంగా పోలీసులు వారికి అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారని నలుగురు వ్యక్తులు రేప్ చేయగా కేవలం ఒకరినే అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న కావలి డీఎస్పీ ప్రసాద్, కొండాపురం ఎస్ఐ మాల్యాద్రిలపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్డీవో శీనానాయక్ వారి వద్దకు వచ్చి వారి సమస్యలను విని వినతి పత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు పసుపులేటి పెంచలయ్య, డేగా సత్యం, కరువది భాస్కర్, టీడీపీ నాయకులు కాకి ప్రసాద్, జ్యోతిబాబూరావు, యేగూరి చంద్రశేఖర్, వైసీపీ నాయకురాలు ఆసిఫాబేగం, ఎల్డర్స్క్లబ్ సభ్యురాలు పార్వతీ శంకర్, ఘ్రా సభ్యురాలు భారతి, గిరిజన సంఘనాయకురాలు చలంచర్ల పద్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు, చేవూరు కిరణ్, కుమార్, అక్కిలిగుంట ఏసు, బీసీ భవన్ ద్రోణాదుల వెంకట్రావు, ముస్లీం నాయకులు హపీజ్ తదితరులు పాల్గొన్నారు.