చెట్టుకింద బీజేపీ కార్పొరేటర్ ప్రజాదర్బార్
ABN , First Publish Date - 2021-04-16T06:35:20+05:30 IST
హబ్సిగూడ వార్డు కార్యాలయం కేటాయింపు విషయంలో
వార్డు కార్యాలయం కేటాయింపు విషయంలో అధికారుల వైఖరికి నిరసన
రామంతాపూర్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : హబ్సిగూడ వార్డు కార్యాలయం కేటాయింపు విషయంలో అధికారుల వైఖరికి నిరసనగా బీజేపీ కార్పొరేటర్ చేతన హరీష్ గురువారం చెట్టు కింద బైఠాయించి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యాలయం కేటాయించే వరకూ ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. గతంలో గెలుపొందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు కేటాయించిన వార్డు కార్యాలయాన్ని అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. క్యాంపు కార్యాలయం పక్కనే అధునాతన జిమ్ ఏర్పాటు కోసం నిర్మించిన భవనాన్ని వార్డు కార్యాలయానికి కేటాయించాలని ప్రస్తుత కార్పొరేటర్ పట్టుబట్టారు. అయితే ఆ భవనంలో మున్సిపల్ డీఈ, ఏఈల కార్యాలయాలు కొనసాగుతుండటంతో అధికారులు ససేమిరా అన్నారు. ఆగ్రహానికి గురైన కార్పొరేటర్ కార్యాలయం వెనుక గల చెట్టు కింద బ్యానర్ తగిలించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భైఠాయించారు. అక్కడే ప్రజా దర్బార్ను నిర్వహించి సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు. ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్ తమ పట్ల వివక్షతను ప్రదర్శిస్తున్నారని కార్పొరేటర్ ఆరోపించారు. వార్డు కార్యాలయం కేటాయించే వరకు రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెట్టు కిందనే ప్రజా దర్బార్ నిర్వహిస్తానని తెలిపారు. డివిజన్ పరిధిలోని ఏదైనా కమ్యూనిటీ హాల్ను ఎంపిక చేసుకుంటే వార్డు కార్యాలయంగా కేటాయిస్తామన్న అధికారుల ప్రతిపాదనను తాను ఒప్పుకునేది లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంజయ్ జైన్, ఎల్లాచారి, పాండు నాయక్, పడితానాయక్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.