నేను కబడ్డీ ఆడుతుండగా వీడియో తీసినవాడు రావణుడు: ప్రజ్ఞా ఠాకూర్
ABN , First Publish Date - 2021-10-16T22:04:47+05:30 IST
బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఇటీవల కబడ్డీ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై
భోపాల్: బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ ఇటీవల కబడ్డీ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై తాజాగా స్పందించిన ప్రజ్ఞా ఠాకూర్ ఆ వీడియో తీసిన వ్యక్తిని ‘రావణుడి’తో పోల్చారు. అతడి వృద్ధాప్యం, మరుజన్మ చాలా దారుణంగా ఉంటాయని శపించారు. కాళీమాత ఆలయ పరిసరాల్లో ప్రజ్ఞా ఠాకూర్ కబడ్డీ ఆడుతూ కూతకు వెళ్లినట్టున్న 10 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో రెండు రోజుల క్రితం విపరీతంగా వైరల్ అయింది.
రెండు రోజుల క్రితం తాను సింధుల ప్రాబల్యం కలిగిన ప్రాంతంలోని దుర్గామాత మండపంలో హారతి ఇచ్చేందుకు వెళ్లేనని, ఆ సమయంలో మైదానంలో కొందరు కబడ్డీ ఆడుతున్న కొందరు తనను అభ్యర్థిస్తే కూతకు వెళ్లానని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. ఆ సమయంలో తీసిన చిన్న వీడియో మీడియాలో వచ్చిందన్నారు.
ఆ వీడియో వెలుగులోకి రావడంపై ప్రజ్ఞ తీవ్రంగా స్పందించారు. వీడియో తీసిన వారిని శపించారు. వారు వృద్ధాప్యంలో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటాని, మరుజన్మ భయంకరంగా ఉంటుందని మండిపడ్డారు.
‘‘రావణుడు మీలోనే ఉన్నాడు. అది సింధీ సోదరుడు కావొచ్చు. మరెవరైనా కావొచ్చు. నేనెవరికీ శత్రువుని కాను. కానీ అతడు తనను శత్రువుగా భావిస్తున్నాడు. అతడి నుంచి విలువైన వస్తువును నేను ఏమి దొంగిలించానో తెలియదు. అయితే, రావణుడు ఎక్కడైనా ఉంటాడు’’ అని ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. ‘‘ఆ వీడియో తీసిన వారి వృద్ధాప్యం, మరుజన్మ కూడా నాశనమైపోతాయి’’ అని శపించారు.