ప్రగతి స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌.. అర్హులెవరంటే..!

ABN , First Publish Date - 2022-09-23T22:06:00+05:30 IST

మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’ (Pragathi Scholarship) నోటిఫికేషన్‌ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా దీనిని ఆఫర్‌ చేస్తోంది. డిప్లొమా, డిగ్రీ కేటగిరీలలో అర్హులైన అమ్మాయిలకు

ప్రగతి స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌.. అర్హులెవరంటే..!

మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’ (Pragathi Scholarship) నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా దీనిని ఆఫర్‌ చేస్తోంది. డిప్లొమా, డిగ్రీ  కేటగిరీలలో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో స్కాలర్‌షిప్‌లు: డిప్లొమా, డిగ్రీ కేటగిరీలలో ఒక్కోదానికి 5,000 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 10,000 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా నిర్దేశిత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకొన్న విద్యార్థినులందరికీ స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు.


  • డిప్లొమా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 318, తెలంగాణకు 206 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు.
  • డిగ్రీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 566, తెలంగాణకు 424 స్కాలర్‌షిప్‌లు ప్రత్యేకించారు.


అర్హత: డిప్లొమా కేటగిరీకి అప్లయ్‌ చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యా సంవత్సరానికి టెక్నికల్‌ డిప్లొమా లెవెల్‌ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


  • డిగ్రీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని టెక్నికల్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందినవారు కూడా అర్హులే. 
  • పదోతరగతి/ ఇంటర్‌ పూర్తిచేసిన రెండేళ్లలోపు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా/ డిగ్రీ ప్రవేశాలు పొంది ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ పొందుతున్నవారు, పీఎంఎస్‌ఎస్‌ఎస్‌ స్కీం కింద చదువుకుంటున్నవారు, నాన్‌ టెక్నికల్‌ కోర్సుల్లో చేరినవారు, డ్యూయెల్‌ డిగ్రీ/ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతరత్రా స్టయిపెండ్‌/ ఆదాయం పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు.

స్కాలర్‌షిప్‌: టెక్నికల్‌ డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులో చేరినవారికి మూడేళ్లు, లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు రెండేళ్లు; టెక్నికల్‌ డిగ్రీ రెగ్యులర్‌ కోర్సులో చేరినవారికి నాలుగేళ్లు, లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు మూడేళ్లపాటు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. కాలేజ్‌ ఫీజు, కంప్యూటర్‌ కొనుగోలు, సాఫ్ట్‌వేర్‌, స్టేషనరీ, బుక్స్‌, ఎక్విప్‌మెంట్‌ తదితరాల నిమిత్తం ఏడాదికి రూ.50,000లు ఇస్తారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) విధానంలో నేరుగా అమ్మాయి బ్యాంక్‌ ఖాతాకు ఈ మొత్తాన్ని జమ చేస్తారు. 


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి/ ఇంటర్‌ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; ఆదాయ ధ్రువీకరణ పత్రం; సంబంధిత కోర్సులో అడ్మిషన్‌ పొందిన లెటర్‌; ట్యూషన్‌ ఫీజు రిసీట్‌; ఆధార్‌ లింక్‌తో ఉన్న బ్యాంక్‌ ఖాతా నంబర్‌; ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌; కుల ధృవీకరణ పత్రం; ఆధార్‌ కార్డ్‌; అభ్యర్థి ఫొటో

ఇన్‌స్టిట్యూట్‌ వెరిఫికేషన్‌: నవంబరు 15 వరకు

డీఎన్‌ఓ/ ఎస్‌ఎన్‌ఓ/ ఎంఎన్‌ఓ వెరిఫికేషన్‌: నవంబరు 30 వరకు

వెబ్‌సైట్‌: scholarships.gov.in

Updated Date - 2022-09-23T22:06:00+05:30 IST