అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-09T21:18:11+05:30 IST

తాడిపత్రిలో అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూశారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు.

అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత

అనంతపురం: తాడిపత్రిలో అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూశారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. 1950లో ప్రబోధానంద జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె ఆయన స్వగ్రామం. మొదటగా పెద్దన్న చౌదరిగా భారత సైన్యంలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేశారు. వైద్యుడిగా కొనసాగుతూ ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. అంతేకాదు ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథాలు రచించారు. తర్వాత ఆధ్మాత్మిక గురువుగా మారిపోయారు. తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరాన్ని స్థాపించారు. మానవులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని,  త్రైత సిద్ధాంతం ఇదే చెబుతుందని ప్రబోధానంద తన రచనల ద్వారా చెప్పేవారు. ఆధ్మాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు.



Updated Date - 2020-07-09T21:18:11+05:30 IST