ఎక్కడ చూసినా విద్యుత్ చౌర్యం.. కట్టడేదీ.. ఒక్క జోన్లోనే రూ. 300 కోట్ల నష్టం..!
ABN , First Publish Date - 2022-05-19T14:36:05+05:30 IST
గ్రేటర్లో విద్యుత్ (Power) చౌర్యం కట్టడి చేయలేక విజిలెన్స్ విభాగం చేతులెత్తేసింది...
- నిద్రావస్థలో విజిలెన్స్ విభాగం
హైదరాబాద్ సిటీ : గ్రేటర్లో విద్యుత్ (Power) చౌర్యం కట్టడి చేయలేక విజిలెన్స్ విభాగం చేతులెత్తేసింది. ఫలితంగా తొమ్మిది నెలల్లో రూ. 300 కోట్ల నష్టం వాటిల్లింది. గ్రేటర్జోన్ పరిధిలో 9 సర్కిళ్లు ఉండగా హైదరాబాద్ (Hyderabad) సౌత్ సర్కిల్లో అత్యధికంగా 42 శాతం నష్టాలు నమోదవుతున్నాయి. 2021 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,24,57,83,080 యూనిట్లు వినియోగం కాగా, బిల్లింగ్ పరిధిలోకి 71,46,79,178 యూనిట్లు మాత్రమే వచ్చాయి. 53,11,03,932 యూనిట్లు లెక్కలోకి రాలేదు. ఒక్క సౌత్సర్కిల్ పరిధిలో ఒక్కో యూనిట్కు రూ. 7 చొప్పున సుమారు రూ.300 కోట్లకు పైగా ఆదాయం డిస్కం కోల్పోయింది.
ఏటా సౌత్ సర్కిల్ పరిధిలోనే ఈ స్థాయిలో నష్టాలు (Loss) వస్తున్నా వాటిని నివారించేందుకు విద్యుత్శాఖ చర్యలు (Electric Department) తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్లోని పలు డివిజన్లలో సైతం 20-30 శాతం వరకు నష్టాలు నమోదవుతున్నాయి. చార్మినార్, అస్మన్గఢ్, బేగంబజార్, మెహిదీపట్నం, అజామాబాద్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మీటర్ ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నా విజిలెన్స్ అధికారులు తనిఖీలు కూడా చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.
ప్రభావం చూపని ప్రత్యేక వ్యవస్థ
విద్యుత్ చౌర్యం కట్టడికి విజిలెన్స్ ప్రత్యేక వ్యవస్థ ఉన్నా ఎలాంటి ఫలితాలూ రావడం లేదు. అధికారులకు ప్రత్యేక వాహనాలు, అదనపు సిబ్బంది, లక్షల్లో వేతనాలు అందిస్తున్నా కొంతమంది నిద్రావస్థను వీడటం లేదు. డొమెస్టిక్, కమర్షియల్ కేటగిరిలో వేల యూనిట్లు బిల్లింగ్లోకి రాకపోయినా క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు. సౌత్ సర్కిల్ పరిధిలో ఒక్కో డివిజన్లో 60-70 శాతం నష్టాలు నమోదవుతున్నా ఏఈ, ఏడీఈ, డీఈలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.