విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి
ABN , First Publish Date - 2021-06-18T04:20:00+05:30 IST
విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలి
- ఎంపీపీ కొప్పు సుకన్యభాషా
యాచారం : గ్రామాల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఎంపీపీ కొప్పు సుకన్యభాషా అన్నారు. గురువారం ట్రాన్స్కో అధికారులతో విద్యుత్ సమస్యలపై సమీక్షించారు. వానాకాలంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోకుండా చూడడంతో పాటు వేలాడుతున్న తీగలను సరి చేయాలని ఆదేశించారు. మండలంలో విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఏఈ సీతారాం పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
తలకొండపల్లి: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంచాలని ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్ కోరారు. నిధులు ఇవ్వకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని సర్పంచ్లపై ఒత్తిడి పెంచడం తగదని ఆమె పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు చంద్రధన, వెల్జాల గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్లను ఆమె పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి సబ్పిడీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఆమె వెంట ఎంపీడీవో రాఘవులు, ఎంపీవో రవీందర్రెడ్డి, సర్పంచ్ లలితాజ్యోతయ్య, బక్కి కుమార్, తదితరులున్నారు.