ప్రభుత్వ అసమర్థతతోనే కోతలు
ABN , First Publish Date - 2021-10-19T05:08:43+05:30 IST
‘రాష్ట్రప్రభుత్వం అసమర్థత కారణంగా విద్యుత్ కోతలు ఎదుర్కోవలసి వస్తోంది. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది’ అని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. సోమవారం మలకాం (జాడపేట), తండ్యాంల్లో వ్యవసాయ మోటర్లకు ఏర్పాటు చేసిన మీటర్లు, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.
- ఉచిత విద్యుత్కు మంగళానికే మీటర్లు
- టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్
పొందూరు, అక్టోబరు 18: ‘రాష్ట్రప్రభుత్వం అసమర్థత కారణంగా విద్యుత్ కోతలు ఎదుర్కోవలసి వస్తోంది. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది’ అని శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. సోమవారం మలకాం (జాడపేట), తండ్యాంల్లో వ్యవసాయ మోటర్లకు ఏర్పాటు చేసిన మీటర్లు, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయ ఉచిత విద్యుత్కు మంగళం పలికేందుకే మోటార్లకు మీటర్లు అమర్చుతున్నారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేది. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు’ అని రవికుమార్ పేర్కొన్నారు. అనంతరం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ‘టీడీపీ హయాంలో రైతులకు వ్యవసాయ రుణాలను రద్దు చేశాం. ప్రస్తుత ప్రభుత్వం రుణాల ఊసే ఎత్తడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా పురోగతి లేదు. అభివృద్ధి లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేసింది’ అని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో మలకాం, తండ్యాం సర్పంచ్లు జాడ శ్రీనివాసరావు, భాస్కరరావు, టీడీపీ నాయకులు చౌదరి బాబ్జి, కూన సత్యనారాయణ, బాడాన గిరి పాల్గొన్నారు.