బెంగళూరుకూ పాకిన సంక్షోభం.. 12 నుంచి విద్యుత్ కోతలు
ABN , First Publish Date - 2021-10-12T02:33:57+05:30 IST
దేశం ఇప్పుడు బొగ్గు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సెగ కర్ణాటకకు కూడా పాకింది. 12వ తేదీ (మంగళవారం)
బెంగళూరు: దేశం ఇప్పుడు బొగ్గు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ సెగ కర్ణాటకకు కూడా పాకింది. 12వ తేదీ (మంగళవారం) నుంచి విద్యుత్ కోతలు ఉండబోతున్నట్టు ప్రభుత్వ రంగ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్సీవోఎం) ప్రకటించింది. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను నాలుగు రేక్లు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్న గంటల్లోనే బీఈఎస్సీవోఎం ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్రలోని చంద్రపూర్ , ఒడిశాలోని మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ గనుల నుంచి కర్ణాటక బొగ్గు కేటాయింపు పొందినందున అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
బెంగళూరులోని సౌత్ జోన్ పరిధిలో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య, మిగతా ప్రాంతాల్లో ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1.30 మధ్య, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 10-5.30 మధ్య, వెస్ట్ జోన్ పరిధిలో ఉదయం 10.30- 5.30 మధ్య, ఈస్ట్ జోన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య, నార్త్ జోన్లో ఉదయం 11-5 మధ్య విద్యుత్ కోతలు ఉంటాయని బీఈఎస్సీవోఎం ప్రకటించింది.