చైనా దిగుమతులపై బ్యాన్‌తో.. వీళ్ల జీవితాల్లో వెలుగులు!

ABN , First Publish Date - 2020-10-17T00:49:03+05:30 IST

చైనా దిగుమతులపై బ్యాన్‌తో.. వీళ్ల జీవితాల్లో వెలుగులు!

చైనా దిగుమతులపై బ్యాన్‌తో.. వీళ్ల జీవితాల్లో వెలుగులు!

వారణాసి: పండుగల సీజన్ వచ్చేస్తోంది. దసరా, దీపావళి వచ్చేస్తున్నాయ్. దీంతో మన సంప్రదాయ వృత్తుల వారికి చేతినిండా పని దొరుకుతోంది. కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న కార్మికులకు కోలుకునే అవకాశం లభిస్తోంది. నవరాత్రి రోజుల్లో హిందూ కుటుంబాల ఇళ్లలో దీపపు ప్రమిదెలు కంపల్సరీ. ఇక దుర్గాపూజ సమయంలో అయితే చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా దీపావళికి ఈ ప్రమిదలే ప్రత్యేక ఆకర్షణ.


దీపపు ప్రమిదెలు.. హిందూ సంప్రదాయంలో వీటి ప్రాముఖ్యత చాలా గొప్పది. దేవుని పూజించే సమయంలో మట్టితో చేసిన ప్రమిదెలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. నవరాత్రి, దుర్గాపూజ ఆల్మోస్ట్ వచ్చేశాయి. దీంతో ప్రమిదెల మార్కెట్ కూడా ఊపందుకుంది. ఈ పరిణామాలపై ప్రమిదెల తయారీదారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కరోనా కారణంగా ఇంతకాలం నానాకష్టాలు పడిన తమకు ఈ పండుగల సీజన్‌ కొంత ఊరటనిస్తోందని అంటున్నారు.


చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడం కూడా ఈ స్థానిక ప్రమిదెల వ్యాపారానికి ఉపయోగపడుతుందని పనివాళ్లు చెప్తున్నారు. చైనా ప్రమిదెల వల్ల మార్కెట్‌లో గట్టిపోటీ ఉండేదని, ఈ ఏడాది ఆ పోటీ కూడా పెద్దగా ఉండకపోవచ్చని వీళ్లు ఆశిస్తున్నారు. వచ్చే పండుగల్లో మట్టి ప్రమిదెల వాడకం పెరిగితే తమ బతుకులు కూడా బాగుపడతాయని అంటున్నారు.


ఏటా ఈ సమయానికి చైనా నుంచి కోట్ల రూపాయల ఉత్పత్తులు భారత మార్కెట్లలో ప్రవేశించేవి. దీపావళి టపాసులేకాక రంగురంగుల క్యాండిల్స్ కూడా వచ్చేవి. అయితే ఇటీవలి కాలంలో క్యాండిల్స్ కన్నా ప్రమిదెలు వాడటానికే భారతీయులు ఆసక్తి చూపడం ప్రారంభించారు. దీంతో ప్లాస్టిక్ ప్రమిదెలను కూడా చైనా కంపెనీలు తయారుచేయడం మొదలెట్టేశాయి. దీంతో మట్టి ప్రమిదెల వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని ప్రమిదెల తయారీదారులు వాపోయారు.


సరిహద్దుల్లో చైనా కవ్వింపు ధోరణి, కపటబుద్ధి బయటపడింది. దీంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై కన్నెర్ర చేసింది. వీటి దిగుమతిపై నిషేధం విధించింది. అంతెందుకు చైనా యాప్స్‌ను కూడా నిషేధించింది. దీంతో ప్రమిదెల ఆర్డర్‌లు ఎక్కువగా వస్తున్నాయని ప్రమిదెల తయారీదారులు వివరించారు. దీపావళి నాటికి మరిన్ని ప్రమిదెల అవసరం ఏర్పడుతుందని, అందుకే ఈ ఏడాది ఉత్పత్తిని బాగా పెంచామని వెల్లడించారు.


ఈ మట్టి మనుషుల నోట్లో మట్టి కొడుతున్న చైనా భూతాన్ని తరిమికొట్టడంతో వీరి జీవితాల్లో వెలుగులు నిండాయి. తాము పేదవారిమని, ప్రమిదెల తయారీతోనే పూటగడవాల్సిన పరిస్థితని తయారీదారులు చెప్పారు. అదే సమయంలో చైనా నుంచి వచ్చే మెషీన్ వస్తువులు, రంగురంగుల ఆకర్షణలతో పోటీ పడలేకపోయామని వివరించారు. దీంతో తాము చాలా ఇబ్బందులు పడేవాళ్లమన్నారు. అలాంటి సమయంలో కరోనా రావడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.


వీరి కష్టాలను అన్‌లాక్‌ ప్రక్రియ చాలా వరకు తీర్చిందట. చైనా ఉత్పత్తులపై బ్యాన్, నెమ్మదిగా అన్‌లాక్ ప్రారంభం అవడంతో మళ్లీ వీళ్ల బిజినెస్ పట్టాలెక్కిందని తెలుస్తోంది.  ఈ కథంతా విన్న నెటిజన్లు.. ఈ దసరా, దీపావళికి మనం కూడా మట్టి ప్రమిదెలే ఉపయోగించి ఈ మట్టి మనుషులకు కొద్దిగా సాయం చేద్దామని పిలుపునిస్తున్నారు.

Updated Date - 2020-10-17T00:49:03+05:30 IST