నాడు బాబు చేసిందే.. నిన్న జగన్ అమలు చేశారు : పోతిన

ABN , First Publish Date - 2021-07-20T17:34:02+05:30 IST

విజయవాడ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజి కార్యాలయం వద్దకు జనసేన నే...

నాడు బాబు చేసిందే.. నిన్న జగన్ అమలు చేశారు : పోతిన

విజయవాడ : ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయిమెంట్ ఎక్చేంజి కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఖండించారు. మరోవైపు.. విజయవాడ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజి కార్యాలయం వద్దకు జనసేన నేత పోతిన మహేష్, ఇతర నాయకులు చేరుకున్నారు. అయితే.. అనుమతి లేదంటూ కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అధికారులే బయటకు రావడంతో విజ్ఞాపన పత్రాన్ని మహేష్ అందజేశారు.


ఇద్దరూ ఇద్దరే..!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. 2.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని సీఎం జగన్ చెప్పడం వాస్తవం కాదా..?. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు జాబుకు లేని జాబ్ లెస్  క్యాలెండర్‌ ప్రకటించారు. ఇది అన్యాయం అంటే.. అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అధికారులు కూడా వినతి పత్రాలు తీసుకోవాలంటే భయపడుతున్నారు. పోలీసులతో అన్యాయంగా మా వారిని అరెస్టు చేయిస్తున్నారు. పాదయాత్రలో ముద్దులు కురిపించి నేడు పోలీసులతో కొట్టిస్తారా..?. ముప్పై లక్షల మంది జీవితాలను నాశనం చేస్తారా..?. నిన్న సీఎం నివాసం ముట్టడి తెలుసుకుని జగన్ పోలవరం పారిపోయారు. చంద్రబాబు చెప్పిన సోమవారం పోలవరంను ‌జగన్ నిన్న అమలు చేసి చూపారు. అంటే... ప్రజలను మోసం చేసే విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరే. నిరుద్యోగులు కల సాకారం‌ చేసే వరకు జనసేన పోరాటం చేస్తుంది. విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు చేసే ఆందోళనకు జనసేన మద్దతు ఉంటుంది. మా నాయకులు పవన్ కళ్యాణ్, మనోహర్‌లు నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు అని పోతిన చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-07-20T17:34:02+05:30 IST