‘సెకండ్ డిప్యూటీ’ ఎన్నిక వాయిదా
ABN , First Publish Date - 2021-05-14T08:41:18+05:30 IST
మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలలో సెకండ్ డిప్యుటీ చైర్పర్సన్ల నియామకాన్ని కరోనా కారణంగా వాయిదా వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరి ని
ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్పొరేషన్లలో సెకండ్ డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలలో సెకండ్ డిప్యుటీ చైర్పర్సన్ల నియామకాన్ని కరోనా కారణంగా వాయిదా వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీరి నియామకానికి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే కొవిడ్ కారణంగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో చట్టపరంగా ఇబ్బందులు ఎదురవకుండా శుక్రవారం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొదటి సమావేశానికి రెండు వారాల ముందు ఆ విషయాన్ని ఎస్ఈసీకి నివేదించాలి. ఆమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికను వాయిదా వేసి మరో తేదీని నిర్ణయిస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 31తో రాష్ట్రంలో మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.