10, 12 తరగతుల పరీక్షలు వాయిదా: సీఐఎ్ససీఈ
ABN , First Publish Date - 2021-04-17T07:19:43+05:30 IST
కౌన్సిల్ ఫర్ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎ్ససీఈ) 12వ తరగతి(ఐఎస్సీ), పదో తరగతి (ఐసీఎ్సఈ) పరీక్షలను వాయిదా వేసింది.
- జూన్ మొదటి వారంలో రీషెడ్యూల్?..
- ‘పది’ పరీక్షలపై విద్యార్థులకు 2 ఐచ్ఛికాలు
హైదరాబాద్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): కౌన్సిల్ ఫర్ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) 12వ తరగతి(ఐఎస్సీ), పదో తరగతి (ఐసీఎస్ఈ) పరీక్షలను వాయిదా వేసింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 4 నుంచి జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు సీఐఎస్సీఈ శుక్రవారం ప్రకటన చేసింది. జూన్ మొదటి వారంలో పరిస్థితిని సమీక్షించి పరీక్షల రీషెడ్యూల్పై నిర్ణయం తీసుకుంటామని సీఐఎస్సీఈ కార్యదర్శి గేరీ అరాథూన్ తెలిపారు. అయితే, పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు రెండు ఐచ్ఛికాలను ఇచ్చారు. వాటిల్లో ఒకటి కరోనా తగ్గుముఖం పట్టాక 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో పది పరీక్షలు రాయడం. రెండోది అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకోవడం. పరీక్షలు రాయకపోతే విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నిష్పాక్షికమైన ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామన్నారు. కొవిడ్ నేపథ్యంలో సీఐఎస్సీఈ గత ఏడాది కూడా పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. మార్కుల కేటాయింపులో మూడు కొలమానాలను నిర్దేశించింది. అప్పటివరకు జరిగిన పరీక్షల్లో సరాసరి మార్కులు, సబ్జెక్ట్ ప్రాక్టికల్, ఇంటర్నల్ అసెస్ మెంట్ ఆధారంగా గత ఏడాది మార్కులు కేటాయించింది. కాగా, ఇటీవలే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి.