శ్రీకాళహస్తిలో రైల్వే ఉద్యోగికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-01T10:57:12+05:30 IST
శ్రీకాళహస్తిలో ఆదివారం మరొకరికి పాజిటివ్ వచ్చింది. బాధితుడు(43) రేణిగుంట వద్ద సీఆర్ఎస్లో మెకానిక్.
78కి చేరిన కరోనా కేసులు
శ్రీకాళహస్తి, మే 31: శ్రీకాళహస్తిలో ఆదివారం మరొకరికి పాజిటివ్ వచ్చింది. బాధితుడు(43) రేణిగుంట వద్ద సీఆర్ఎస్లో మెకానిక్. ఈయన గాంధీవీధి వద్దనున్న మసీదు సమీపంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల చెన్నై వెళ్లిన ఈయన మే 23న శ్రీకాళహస్తికి వచ్చారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో స్వచ్ఛందంగా వెళ్లి 25న వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈయన్ను తిరుపతికి తరలించారు. కాగా, కరోనా నేపథ్యంలో నెల రోజులుగా విధులకు హాజరు కాలేదని, ఇంటి వద్ద ఒక్కడే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. చెన్నై మూలాలతో వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. ఆయన నివాసమున్న ప్రాంతం కూడా కంటైన్మెంట్ జోన్లో ఉంది. ఆ దిశగా కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
కేవీబీపురంలో మరొకరికి
కేవీబీపురంలోని దళితవాడకు చెందిన 21ఏళ్ల యువకుడికి కరోనా ఉన్నట్లు ఆదివారం బయటపడింది. ఇతడు జీవనోపాధి కోసం ముంబై వెళ్లారు. అక్కడ కరోనా ఎక్కువగా ఉండటంతో మూడు రోజుల కిందట జిల్లాకు వచ్చారు. అతడిని చిత్తూరు సమీపంలోని ఓ క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించి.. పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో మండలంలో కొవిడ్ కేసుల సంఖ్య ఆరుకు చేరాయి.