నెలలో 300 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-11-30T10:23:37+05:30 IST
రాష్ట్రంలో భౌతిక హాజరుతో తొలిగా తరగతులు ప్రారంభించిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో వరుసగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
గురుకుల డిగ్రీ కళాశాలల్లో భయం భయం
తాజాగా ఖమ్మం జిల్లా తనికెళ్లలోనూ కేసులు
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భౌతిక హాజరుతో తొలిగా తరగతులు ప్రారంభించిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో వరుసగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలోని 30 గురుకులాల్లో చివరి సంవత్సరం విద్యార్థులు ఈ నెల 1 నుంచి క్లాసులకు హాజరవుతున్నారు. ప్రతి విద్యార్థికి రెండు మాస్క్లు, శానిటైజర్ ఇస్తుండటంతో పాటు వారంలో రెండుసార్లు కళాశాలను శానిటైజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఇప్పటికి 300 మందిపైగా విద్యార్థులు, సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
సంగారెడ్డిలో మొదలు.. సంగారెడ్డిలోని డిగ్రీ గురుకుల కళాశాలలో ఆరుగురు విద్యార్థులతో పాటు స్టాఫ్ నర్స్కు ఈ నెల ప్రారంభంలో పాజిటివ్ వచ్చింది. తర్వాత భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మహిళా డిగ్రీ గురుకులం సిబ్బంది, విద్యార్థులు కరోనా బారినపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది సహా 75మందికి, ఖమ్మం జిల్లా తనికెళ్లలోని మహిళా గిరిజన డిగ్రీ గురుకులంలోనూ కేసులు వచ్చాయి. తనికెళ్ల కళాశాల సిబ్బంది.. సహోద్యోగి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. అనంతరం ఆ ఉద్యోగికి పాజిటివ్గా తేలడంతో పరీక్షలు చేయించుకున్నారు. బోధనేతర సిబ్బంది ఐదుగురికి వైరస్ నిర్ధారణ అయింది. వీరి ద్వారా హాస్టల్లో ఉంటూ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు వ్యాప్తి చెందవచ్చని భావించి వారిని ఇంటికి పంపాలని అధికారులు ఆదేశించారు.