ధర్మ సమ్మేళనం

ABN , First Publish Date - 2021-03-10T12:47:35+05:30 IST

‘ధర్మం పేరిట ఉగ్రవాదం విలయతాండవం చేస్తుండగా ధర్మాన్ని విశ్వసించే వారు మౌనంగా ఉండడం భావ్యం కాదు’

ధర్మ సమ్మేళనం

‘ధర్మం పేరిట ఉగ్రవాదం విలయతాండవం చేస్తుండగా ధర్మాన్ని విశ్వసించే వారు మౌనంగా ఉండడం భావ్యం కాదు’ ఇవి, క్రైస్తవ మత అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ మాటలు. ఇటీవల ఇరాక్ పర్యటన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామేతర మతాల పట్ల వివక్ష పాటిస్తుండే అరబ్బు దేశాల వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. అసహనం, అతివాదం, హింస ధర్మ విరుద్ధమైనవి, ఏ మతమూ ఆమోదించని దుష్ట వర్తనలవి. 


‘ధర్మం పేరిట ఉగ్రవాదం విలయతాండవం చేస్తుండగా ధర్మాన్ని విశ్వసించే వారు మౌనంగా ఉండడం భావ్యం కాదు’ ఇవి, క్రైస్తవ మత అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ మాటలు. ఇటీవల ఇరాక్ పర్యటన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామేతర మతాల పట్ల వివక్ష పాటిస్తుండే అరబ్బు దేశాల వారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. అసహనం, అతివాదం, హింస ధర్మ విరుద్ధమైనవి, ఏ మతమూ ఆమోదించని దుష్ట వర్తనలవి. 


ఇరాక్‌లోని క్రైస్తవులను భూమ్మీద ఉన్న తొలి తరం క్రైస్తవులుగా భావించడం కద్దు. నాగరికత ప్రభవించిన ఇరాక్‌లో ఇస్లాం ఉదయించక పూర్వమే క్రైస్తవం వర్ధిల్లింది. ఇరాక్ పై ముస్లింలకు ఎంత హక్కు ఉందో క్రైస్తవులకు కూడా అంతే హక్కు ఉంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనే ఉగ్రవాద సంస్థ సృష్టించిన బీభత్సనికి మతం కాదు మానవత్వమే క్రుంగిపోయింది. 


సద్దాం హుస్సేన్ పాలనలో ఇరాక్ క్రైస్తవులు సురక్షితంగా ఉండేవారు. 2003లో ఇరాక్‌ను అమెరికా అక్రమించిన అనంతరం క్రైస్తవులు అభద్రతకు లోనయ్యారు. 2014లో ‘ఇస్లామిక్ స్టేట్’ దురాగతాల ఫలితంగా వారు చెల్లచెదురయ్యారు. సద్దాం కాలంలో 14 లక్షలుగా ఉన్న క్రైస్తవ జనాభా ప్రస్తుతం రెండు నుంచి మూడు లక్షల వరకు మాత్రమే ఉన్నట్లుగా ఒక అంచనా. ఇరాక్ చవిచూసిన మూడు యుద్ధాలలో కూడా దేశాధినేత సద్దాం హుస్సేన్ పక్షాన గట్టిగా నిలబడిన నాయకుడు, విదేశాంగ మంత్రి తారీఖ్ అజీజ్ క్రైస్తవుడు. 


సద్దాం హుస్సేన్ నిష్కృమణనంతరం పెరిగిపోయిన షియా ప్రాబల్యం, బలహీనపడ్డ సున్నీల నేపథ్యంలో అవతరించిన ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రరూపం వీటన్నింటికి మించి అచేతన ప్రభుత్వం, సైన్యం ఇత్యాది కారణాల వలన (ఒకప్పుడు ప్రబల శక్తిగా ఉన్న) ఇరాక్ పరిస్ధితి అమెరికా కారణాన కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయింది. అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది క్రైస్తవులు. ఈ నేపథ్యంలో పోప్ ఇరాక్‌ను సందర్శించారు. వాటికన్‌లో కంటే ముందుగా క్రైస్తవులు, క్రైస్తవ ఆరాధనా మందిరాలు ఉన్న అస్రియా ప్రాంతంలో పోప్ పర్యటన, ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదులు ధ్వంసం చేసిన మోసోల్ నగరం లోని చర్చిల శిథిలాల వద్ద పోప్ చేసిన ప్రార్ధనలు క్రైస్తవేతరుల హృదయాలనూ కదిలించాయి.


కేథలిక్ క్రైస్తవులకు వాటికన్ అధిపతి పోప్ ఏ విధంగా ప్రధాన గురువో అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు ఇరాక్‌లోని నజాఫ్ అనే నగరంలో అయతొల్లా అలీ అల్ సిస్తానీ అదే స్ధాయి గురువు. పోప్ తన పర్యటనలో అయతొల్లా సిస్తానీతో సమావేశం కావడం ఒక చరిత్రాత్మక సన్నివేశం. ఇప్పటి వరకు ఇరాక్ ప్రధాన మంత్రులు, అధ్యక్షులను మ సైతం కలువడానికి ఇష్టపడని అయతొల్లా, పోప్‌తో సమావేశం కావడానికి సిద్ధమయ్యారు. తన జీవిత కాలంలో ఏ దేశాధినేత వచ్చినా లేచి నిల్చోని ఆయతొల్లా పోప్‌కు స్వాగతం పలుకడానికి ప్రధాన ద్వారం వరకు రాగా, పోప్ కూడ తన చెప్పులు విడిచి మరీ అయతొల్లా ఇంట్లో అడుగుపెట్టడం గమనార్హం. 


అబ్రహాంగా క్రైస్తవులు, యూదులు; ఇబ్రహీంగా ముస్లింలు ఆరాధించే పవిత్ర దైవదూత జన్మస్ధలం ఊర్‌ను కూడ పోప్ సందర్శించి సర్వమతాలు శాంతితో వర్ధిల్లాలని ప్రార్ధించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు ఇరాక్‌కు యాత్రికులుగా వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలను దృష్టిలో పెట్టుకొని పోప్ తనను తాను శాంతి యాత్రికుడుగా అభివర్ణించుకున్నారు. ఇరాక్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది, అయినా పోప్ పర్యటించారంటే ఆ పర్యటనకు ఉన్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు.పోప్ పర్యటనతో క్షేత్రస్ధాయి పరిస్ధితులలో మార్పు ఉండకపోవచ్చు. అయితే మతం అనే ఒకే ఒక్క కారణంతో కట్టుబట్టలతో పారిపోయి ప్రాణాలు కాపాడుకున్న ఇరాకీ క్రైస్తవులలో ఆయన పర్యటన ఒక నిండు ఆశాభావాన్ని కలిగించిందని చెప్పవచ్చు.


మొహమ్మద్ ఇర్ఫాన్


ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-03-10T12:47:35+05:30 IST