పది రోజుల్లోనే ‘తారు’మారు!
ABN , First Publish Date - 2021-07-28T04:29:14+05:30 IST
పది రోజుల్లోనే ‘తారు’మారు!
- కాపుతెంబూరు -నౌగాం రహదారి పనుల్లో నాణ్యతాలోపం
టెక్కలి రూరల్, జూలై 27 : బ్లాక్టాప్ రోడ్డు వేసి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. కానీ ఎక్కడబడితే అక్కడే ముక్కా, ముక్కా ఊడిపోయింది. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం బయటపడింది. వివరాల్లోకి వెళితే కోటబొమ్మాళి పీఐయూ డివిజన్ పరిధి నందిగాం మండలం జాతీయ రహదారి నుంచి వయా కాపుతెంబూరు, నౌగాం వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.3.67కోట్లతో 5.7 కిలోమీటర్ల మేర తారురోడ్డు వేశారు. నిర్మాణ పనులు జరిగిన పది రోజుల్లోనే ఈ రోడ్డుపై తారు కరిగిపోయి.. ఎక్కడపడితే అక్కడ ముక్కలు ఊడిపోతోంది. సంబంధిత కాంట్రాక్టర్ మరమ్మతులు చేసి మమ అనిపిస్తున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యతాలోపంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు స్థానికులు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయమై ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అప్పలసూరి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా వర్షాకాలం కావడంతో బ్లాక్టాప్ రోడ్లకు కొంత ఇబ్బందులు కలిగి ఉండవచ్చునన్నారు. ఎక్కడైనా నాణ్యత లోపం కనిపిస్తే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ రహదారి పనులు నేషనల్ క్వాలిటీ మానిటర్ బృందం పరిశీలించిందన్నారు.