పూజా కుసుమం భక్త శబరి
ABN , First Publish Date - 2020-10-30T11:29:50+05:30 IST
మన్యంలో విరిసిన పూజా కుసుమం భక్త శబరి. వాల్మీకి రామాయణంలో చాలా నిడివ తక్కువ పాత్రైనా శబరికి ఉన్న ప్రాధాన్యం ఎంతో విశేషమైంది.
రేపు అపర భక్తురాలి స్మృతి యాత్ర
ఈసారి కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ
ప్రకటించిన భద్రాద్రి దేవస్థానం అధికారులు
భద్రాచలం, అక్టోబరు 29: మన్యంలో విరిసిన పూజా కుసుమం భక్త శబరి. వాల్మీకి రామాయణంలో చాలా నిడివ తక్కువ పాత్రైనా శబరికి ఉన్న ప్రాధాన్యం ఎంతో విశేషమైంది. మాతంగ మహర్షి ఆశ్రమంలో పరిచారికగా మహర్షులకు సేవలు చేస్తూ తరిస్తున్న శబరి రామచంద్రమూర్తి రాక కోసం వేచిచూసింది. సీతాన్వేషణ నిమిత్తమై తన దగ్గరకు వచ్చిన రామలక్ష్మణులను చూసి ఒక్కసారిగా పొంగిపోయింది. రుచికరమైన పండ్లను ఏరి తీసుకొచ్చి, రుచి చూసి ఆ ఎంగిలి పండ్లనే స్వామికి సమర్పించి తన భక్తిని చాటింది. దీంతో రాముని అనుగ్రహంతో ఆ భక్తురాలు ముక్తిని పొందింది. ఈ నేపథ్యంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా , కొవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు పలు రకాల ఫలాలు, పుష్పాలతో రామచంద్రునికి పూజాది కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముందుగా గిరి ప్రదక్షిణ, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించి పుష్పాలు, ఫలాలతో మంత్రపుష్పంతో శబరి యాత్ర పరిసమాప్తం కానుంది.
ఇది ఎనిమిదోసారి
గిరిజనులు కొలిచే దేవత భక్త శబరి పేరిట దేవస్థానంలో శుక్రవారం ఎనిమిదోసారి శబరి స్మృతి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి 2013లో అప్పటి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ అయిన వినోద్కుమార్ అగర్వాల్ శ్రీకారం చుట్టారు. 2013 నుంచి ఏటా ఆశ్వీజమాసంలో పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కాగా వేడులను కొంత మంది వైదిక పరిపాలన సిబ్బందితో ఆలయంలో నిరాడంబరంగా నిర్వహించనున్నారు.