జాతీయ రహదారి కోసం చెరువు పూడ్చివేత
ABN , First Publish Date - 2020-12-03T08:04:07+05:30 IST
తెలంగాణలో జాతీయ రహదారిని విస్తరించడానికి చెరువును పూడ్చిన విషయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఒక కమిటీని నియమించింది.
నష్టంపై అధ్యయనానికి ఎన్జీటీ కమిటీ
న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జాతీయ రహదారిని విస్తరించడానికి చెరువును పూడ్చిన విషయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఒక కమిటీని నియమించింది. సూర్యాపేట-ఖమ్మం మధ్యలో 365బీబీ నంబరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా.. జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) చెరువును పూడ్చివేసిందని దుశ్చర్ల సత్యనారాయణ అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. చెరువు పూడ్చివేత వల్ల పర్యావరణానికి కలిగిన హాని, ప్రజలకు జరిగిన నష్టం, నిబంధనల ఉల్లంఘన, పర్యావరణ అనుమతులు.. తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్తో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది.