పరి‘హాసం’

ABN , First Publish Date - 2022-09-15T05:11:43+05:30 IST

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి వచ్చిన తమకు తినడానికి తిండి, ఉండడానికి గూడు లేదని తల్లవరం ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

పరి‘హాసం’
కొండపోడులో ఏర్పాటు చేసుకున్న నివాసాలు

పునరావాసం.. తల్లవరానికి శాపం

32 కుటుంబాల వేదన.. 

వర్షాలకు..వరదలకు నరక యాతన

 

పోలవరం, సెప్టెంబరు 14 : పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి  వచ్చిన తమకు తినడానికి తిండి, ఉండడానికి గూడు లేదని తల్లవరం ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన వున్న 19 నిర్వాసిత గ్రామాల వారికి అన్ని పరిహారాలు ఇచ్చి, పునరావాసాలు కల్పించి తరలిం చామని చెబుతున్న అధికారులు తల్లవరానికి చెందిన 32 కుటుంబాలను గాలికి వదిలేయడంతో వారు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. గతంలో అందాల్సిన పరిహారాలు, భూమికి భూమి, పునరావాసాలు కల్పించే వరకూ గ్రామాన్ని వీడేది లేదని వరదలు వచ్చినా కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని 32 గిరిజన కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాయి. గ్రామంలో కొందరు జీలుగుమిల్లి మండలం పూచికపాడు, పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట పునరావాస కాలనీ, రెడ్డి గణపవరంలో నివాసాలకు వచ్చేశారు. మిగిలిన 32 కుటుంబాలకు పూచికపాడులో కేటాయించిన భూములు రాళ్ళు, ఇసుక ఉండి సాగుకు యోగ్యం కాదని, నీటి సదుపాయం లేదని వీటిని తీసుకు నేందుకు నిరాకరించారు. అధికారులు తమకు భూములు అప్పగించామని చెబుతున్నా భూముల విషయంపై అధి కారులు చూపిన పత్రాలలో తమ పేర్లు లేవని, కావాలనే నిర్వాసితులను మభ్యపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. వారు కమీషన్లకు కక్కుర్తి పడి రాళ్లు, చౌడు ఉన్న సాగుకు పనికిరాని భూములను కొనుగోలు చేసి తమకు బలవం తంగా అంటగట్టడానికి చూస్తున్నారని వాపోయారు. 18 ఏళ్ల వయసున్న 15 మందికి పరిహారం ఇవ్వలేదని, గ్రామాన్ని వదిలి మూడు నెలలు కావస్తున్నా పరిహారం, పునరావాసం కల్పించకుండా గాలికి వదిలేశారని వాపో యారు. వరదలు వచ్చిన తర్వాత కొండలపై నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి మైదాన ప్రాంతానికి తరలి వచ్చామన్నారు. 32 కుటుంబాలలో కొందరు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. మరికొందరు అద్దెలు కట్టలేక వింజరం సమీపంలో 80 సెంట్ల భూమిని కౌలుకు తీసుకుని తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటు న్నారు. వీరికి కనీసం మంచినీటి సదుపాయం కూడా లేదు. కొండ ప్రాంతం వల్ల దోమలు, పాములు, విష కీటకాలతో విష జ్వరాలతో అవస్థలు పడుతున్నారు. పోలవరం మండలం ప్రగడపల్లి సమీపంలోని గుళ్లపూడిలో కొండరెడ్లు 40 ఎకరాల భూములను ప్రభుత్వానికి భూసేక రణకు ఇవ్వడానికి అంగీకరిం చారు. వీటిని కొనుగోలు చేసి తమకు అప్పగించాలని వీరు కోరుతు న్నారు. పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు మూడు నెలలుగా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. 


 గ్రామాలకు వెళ్లిపోతాం

– మాడే పెంటయ్య, నిర్వాసితుడు

మూడు నెలల నుంచి కూడు, గూడు లేదు. ఉపాధి అంతకన్నా లేదు. అధికారులు పట్టించుకో వడం లేదు. పసి పిల్లలతో అవ స్థలు పడుతున్నాం. మాకు అందాల్సిన పరిహారాలు, భూములు ఇచ్చి పునరావాసాలు కల్పించాలి. లేకపోతే మళ్లీ మా గ్రామాలకు వెళ్లిపోతాం.


 ఈ భూములు ఏం చేసుకోవాలి

– పద్దం నర్సమ్మ, తల్లవరం

పరిహారాలందిస్తాం, కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామంటూ మా చుట్టూ తిరిగిన అధికారులు ఇప్పుడు ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు. ఎలాంటి ఉపాధి లేక ఆకలితో అల్లాడుతున్నాం. మంచినీటి కోసం కిలోమీటరు వెళ్లాల్సి వస్తోంది. సాగుకి పనికి రాని భూములు ఏం చేసుకోమంటారు. 


  ఏమీ లేవు.. ఎలా బతకాలి

– మాడే పోశమ్మ, తల్లవరం

మాకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. గోదావరి ముంచుకొస్తే ఉండలేక కొండల మీదుగా వచ్చేశాం. రేషన్‌ కోసం12 కిలోమీటర్లు ఎల్‌ఎన్‌డీ పేట వెళ్లి తెచ్చుకోవాలి. రవాణా సౌకర్యాలు లేవు. రేపల్లివాడ వరకూ ఐదు కిలోమీటర్లు వెళ్లి అక్కడి నుంచి మరో ఏడు కిలోమీటర్లు ఎల్‌ఎన్‌డీ పేట వెళ్లి తెచ్చుకోవాలి. పరిహారాలు లేవు, కూలి పనులు లేవు, మంచినీరు లేదు.  


నివేదిక పంపించాం

– తహసీల్దారు బి.సుమతి

జీలుగుమిల్లి మండలం పూచికపాడులో వారికి భూమికి భూమి , పునరావాసాలు కల్పించాం. వాటిని నిర్వాసితులు నిరాకరించారు. ఈ విషయంపై ఆర్డీవో విచారించి ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌కు నివేదిక పంపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2022-09-15T05:11:43+05:30 IST