విజయవాడలో 2 గంటలకు 50 శాతం పోలింగ్ నమోదు
ABN , First Publish Date - 2021-03-10T21:14:51+05:30 IST
విజయవాడలో 2 గంటలకు 50 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. చివరి 2 గంటల్లో తమకు అనుకూలమైన డివిజన్లలో రిగ్గింగ్ చేసేందుకు
విజయవాడ: విజయవాడలో 2 గంటలకు 50 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. చివరి 2 గంటల్లో తమకు అనుకూలమైన డివిజన్లలో రిగ్గింగ్ చేసేందుకు వైసీపీ యత్నాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓట్లు వేసిన వారే మళ్లీమళ్లీ వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ ఏజెంట్లను సైతం బెదిరించి దొంగ ఓట్లకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్ల వద్దకు పోలీసులు అదనపు బలగాలను పంపుతున్నారు.
అంతకుముందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ వద్ద వైసీపీ నేతలు దాదాగిరికి దిగారు. ఫ్యాన్కు ఓటు వేయాలి అంటూ ఓటు హక్కును వినియోగించుకోడానికి వచ్చినవారిని వైసీపీ నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల కనుసంధనలో జరుగుతున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతల దాదాగిరిపై స్వర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కొనసాగుతోంది. ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్జెండర్లు 1150 మంది ఉన్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.