హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు.. టీడీపీ, టీఆర్ఎస్ను పోల్చుతూ నెట్టింట హాట్ టాపిక్
ABN , First Publish Date - 2021-11-02T20:32:39+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్పై బీజేపీ ఆధిక్యం సాధిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు ఎదురే లేదు అనుకునే తరుణంలో ఇటీవల ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్పై బీజేపీ ఆధిక్యం సాధిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు ఎదురే లేదు అనుకునే తరుణంలో ఇటీవల ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం ఈటల రూపంలో మరో గట్టి షాక్ తగిలింది. ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లో వినూత్న చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్కు నవంబర్ నెల కలిసిరావడం లేదని చర్చించుకుంటున్నారు. గత ఏడాది నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో నువ్వానేనా అంటూ సాగిన పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థిని సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు.. విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ నవంబర్లోనే టీఆర్ఎస్ పార్టీ పరాభవం దిశగా పయనిస్తుండడాన్ని కలిసిరాకపోవడానికి సంకేతంగా భావిస్తున్నారు.
టీడీపీకి ఆగస్టు సంక్షోభం ఎలాగో.. టీఆర్ఎస్కు నవంబర్ సంక్షోభం అలాగని పోల్చుకుంటున్నారు. గతంలో టీడీపీ కూడా చాలా సందర్భాల్లో ఆగస్టు నెలల్లోనే పలు సంక్షోభాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు నుంచి, ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరకు.. ఆగస్టు సంక్షోభాన్ని చవిచూశారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రస్తుతం.. టీడీపీ, టీఆర్ఎస్ను పోల్చుకుంటూ ఆగస్టు, నవంబర్ నెలలపై చర్చ నడుస్తోంది.