రాజకీయ వలసలు!
ABN , First Publish Date - 2022-05-19T06:54:03+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర కాలం ఉన్నారు.. అప్పుడే జిల్లాలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. అన్ని పార్టీల నేతలు వలసలపై దృష్టిపెట్టి ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. పార్టీబలోపేతమయ్యేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో అన్ని పార్టీల్లో వలసలకు ప్రోత్సాహం
ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాలలో బలోపేతంపైనే దృష్టి
జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయా పార్టీల నేతలు
నిజామాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర కాలం ఉన్నారు.. అప్పుడే జిల్లాలో రాజకీయ వలసలు మొదలయ్యాయి. అన్ని పార్టీల నేతలు వలసలపై దృష్టిపెట్టి ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. పార్టీబలోపేతమయ్యేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా వలసలను ప్రోత్సహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో మరింత బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో అన్ని పార్టీల్లో వలసలు పెరగడంతో రాజకీయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. గ్రామ, మండలస్థాయి నేతలను తమ పార్టీల్లో చేర్చుకుంటున్నారు.
మంత్రి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం
జిల్లాలో అధికార టీఆర్ఎస్లోకి ఎక్కువగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల నేతలతో పాటు తటస్థంగా కూడా చేర్చుకుంటున్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు గడిచిన నెల రోజులుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల వారు ఆయన సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల నేతలు చేరుతున్నారు. ఆయనేకాకుండ ఎమ్మెల్సీ కవిత సమక్షంలో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నేతలు చేరుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ నియోజకవర్గంలో, ఆర్మూర్లో జీవన్రెడ్డి, బోధన్లో షకీల్ అమిర్, అర్బన్లో బిగాల గణేష్గుప్త ఆధ్వర్యంలో చేరికలు జరుగుతున్నాయి. బాన్సువా నియోజకవర్గం పరిదిలో కూడా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తనయులు పోచారం భాస్కర్రెడ్డి, సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు కొనసాగుతున్నాయి. జిల్లాతో పాటు రాష్ట్ర రాజధానికి వెళ్లి పార్టీలో చేరుతున్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిదిలో గడిచిన కొన్ని రోజులుగా ఈ చేరికలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. గ్రామస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు మండలస్థాయిలో ప్రతిపక్ష పార్టీల ద్వితీయశ్రేణి నేతలను చేర్చుకుంటున్నారు. తమ పార్టీకి వచ్చే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించి చేర్చుకుంటున్నారు. వారికి తగినవిధంగా పార్టీలో హోదాలు కల్పిస్తామని హామీలను ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమ నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల బలాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పాగా వేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముందస్తు బలోపేతంపై హస్తం దృష్టి
అధికార పార్టీ ముందస్తుగా బలోపేతంపై దృష్టిపెట్టడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దృష్టిపెట్టారు. బోధన్, నిజామాబాద్రూరల్, అ ర్బన్, బాన్సూవాడ, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో ఇన్చార్జిల ఆధ్వర్యం లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్కు మనోధైర్యం ఇవ్వడంతో పాటు కలిసి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి రెగ్యులర్గా పర్యటిస్తున్నారు. క్యాడర్కు అందుబాటులో ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెద్దగా ఉంటూ ఇతర ని యోజకవర్గాల్లో కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. నేతలను సమన్వయపరుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో తాహెర్బిన్ హుందాన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నా రు. మరింత బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ రూర ల్ నియోజకవర్గం పరిధిలో ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డితో పాటు నగేష్రెడ్డి కూడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో మాజీ విప్ ఈరవత్రి అనిల్తో పాటు జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి పని చేస్తున్నారు. ఆర్మూర్కు ఇన్చార్జి లేకున్నా.. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్తో తదితరులు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపతంపై దృష్టిపెట్టారు.
సెగ్మెంట్ల వారీగా కమలం కార్యాచరణ
జిల్లాలో బీజేపీ కూడా ఈ దఫా అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జ్లను ని యమించిన ఆ పార్టీ మరింత బలోపేతంపైన దృష్టిపెట్టింది. ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తునే తటస్తులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారస్తులు, ఉద్యోగ సంఘాల నేతలను చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, ధన్పాల్ సూర్యనారాయణల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పోటీకి సిద్ధమవుతున్న ఇతర పార్టీలు
జిల్లాలో ఈ దఫా ఇతర పార్టీలు కూడా పోటికి సిద్ధమవుతున్నాయి. గతంలో బీఎస్పీ నుంచి పోటి చేసిన సునీల్రెడ్డి ఈ దఫా పోటికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, బీఎస్పీ, ఆమ్ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్టీపీ పార్టీలు కూడా పోటీపడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ పార్టీల నుంచి తటస్తులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.