పొలాలకు వెళ్లకుండా రైతుల నిలిపివేత
ABN , First Publish Date - 2022-06-29T05:53:48+05:30 IST
ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి, పెనుమాక ప్రాంతంలో ఉన్న తమ పొలాలకు వెళ్లకుండా ఉండవల్లి గుహాలయాల సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల చర్యలపై స్థానిక రైతులు ఆగ్రహం
తాడేపల్లి, జూన్28: ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి, పెనుమాక ప్రాంతంలో ఉన్న తమ పొలాలకు వెళ్లకుండా ఉండవల్లి గుహాలయాల సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బందోబస్తు పేరిట పోలీసులు చేస్తున్న ఈ చర్య వల్ల రైతాంగం తమ పొలాలలకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమకు అధికారుల నుంచి వచ్చిన రైతుల లిస్టు ప్రకారం పంపిస్తున్నామని చెబుతున్నారని అన్నారు. చివరకు తమ పొలాలకు అనుమతి తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పోలీసుల అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని పెనుమాక, ఉండవల్లి రైతులు కోరుతున్నారు. ఇదే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.