రాత్రి తిరిగితే బాదుడే

ABN , First Publish Date - 2020-03-27T09:46:22+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌

రాత్రి తిరిగితే బాదుడే

సంచార నియంత్రణలో పోలీసులు


పులివెందుల టౌన్‌/పులివెందుల రూరల్‌, మార్చి 26: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ విజయవంతం చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుం టున్నారు. ఎంతచెప్పినా వినకుండా రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీస్‌ ఫైర్‌ అవుతున్నారు. పూర్తిగా వినకపోతే కేసులు నమోదు చేస్తామని  డీఎస్పీ వాసుదేవన్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ సు ధాకర్‌ హెచ్చరిస్తున్నారు. పట్టణంలో సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు గోపినాథ్‌రెడ్డి, చిరంజీవి, సిబ్బందితో మార్చ్‌ నిర్వహించారు. యువత బైకుపై రోడ్డుపై తిరుగుతూ, సెల్ఫీలు దిగుతుం డడంతో పోలీసులు వారి వాహనాలను స్టేషన్‌ కు తరలించారు. అయినా మాట వినకపోవడం తో పోలీసులు లాఠీలతో బుద్దిచెప్పారు. నిత్యావసర సరుకులు, మందుల షాపులు మినహా మిగిలిన దుకాణాలన్నీ మూతపడ్డాయి. తెరిచిన దుకాణాలపై పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేసి మూసివేయించారు. 


లాక్‌డౌన్‌ నేపథ్యంలో  పలు ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనిమీద ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారు ఇళ్లు విడిచి రాలేదు. సీఐ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయని హెచ్చరించా రు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు జన సంచారాన్ని పూర్తిగా నిషేధించారని వివరించారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1  గంట వరకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, డైరీలకు అనుమతులు ఇస్తూ కుటుంబంలో ఒక్కరే వెళ్లేలా అవకాశం కల్పించారు.


  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 30 మంది స్పెషల్‌ పార్టీ బలగాలు వచ్చాయన్నారు. పులివెందులలో మూడు చోట్ల కూరగాయల మార్కెట్లు ఏర్పాటుచేస్తున్నట్లు కమిషనర్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌, పాతమార్కెట్‌లో మార్కెట్లు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు.    


Updated Date - 2020-03-27T09:46:22+05:30 IST