కర్నూలు కూలీలకు పోలీసు బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-03-29T08:57:58+05:30 IST

లారీల్లో భారీగా తరలివచ్చిన వలసకూలీలను ప్రకాశం జిల్లా పోలీసులు అడ్డుకుని తిప్పి పంపారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4వేలమంది...

కర్నూలు కూలీలకు పోలీసు బ్రేక్‌!

  • క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని ఆదేశాలు
  • నిలిచిన 92 వాహనాలు.. తిండి లేక 4వేల మంది కూలీల అవస్థలు

త్రిపురాంతకం, మార్చి 28 : లారీల్లో భారీగా తరలివచ్చిన వలసకూలీలను ప్రకాశం జిల్లా పోలీసులు అడ్డుకుని తిప్పి పంపారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4వేలమంది కూలీలు మిర్చికోతలు, ఇతర పనులకు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పేరేచర్ల తదితర ప్రాంతాలకు వెళ్లి పనుల్లేక స్వగ్రామాలకు తిరుగు పయనమయ్యారు. త్రిపురాంతకం మండలంలోని జి.ఉమ్మడివరం చెక్‌పోస్టు వద్ద కూలీలు వెళుతున్న లారీలను శుక్రవారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతులు లేవని, గుంటూరు జిల్లాలోనే వైద్యపరీక్షలు చేయించుకుని, క్వారంటైన్‌ వార్డులకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో కూలీలు అక్కడి నుంచి ఎటూ వెళ్లలేక తిండితిప్పలు లేకుండా రోడ్డుపైనే ఇబ్బందిపడ్డారు. శనివారం ఉదయానికి కూడా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో సీఐ మారుతీకృష్ణ, ఎస్సై యూవీ.కృష్ణయ్య సూచనలతో గ్రామస్థులు అప్పటికప్పుడు ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి కూలీల కోసం వంటలు మొదలు పెట్టారు. ఈలోగా అక్కడికి వచ్చిన అధికారులు కూలీలను ముందుకు వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా కూలీలంతా ఆకలితో అలమటిస్తూ లారీల కింద సేదతీరారు.


కూలీలలో కొందరు మహిళలు, గర్భిణిలు, చంటిబిడ్డలతో పోలీసుల ఎదుట చేతులు జోడించి రోదించారు. అయితే గుంటూరు జిల్లా పోలీసులు వచ్చి సగం వాహనాలను వెనక్కి తిప్పి వినుకొండ వైపు పంపారు. మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్న మార్కాపురం ఆర్డీవో శేషిరెడ్డి, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్‌డీసీ చంద్రలీల చర్చించుకుని మిగిలిన వాహనాలను కూడా వెనక్కి పంపారు. ఈలోగా వంటలు రెడీ అయినప్పటికీ కూలీలకు అందజేయకుండానే వారిని వెనక్కి పంపేయడంతో గ్రామస్థులు కొంత అసహనానికి గురయ్యారు. కేవలం పది వాహనాలలోని కూలీలకు మాత్రమే రెండు కిలోమీటర్ల తరువాత నిలిపి భోజనాలను అందించి ఆకలి తీర్చగలిగారు. 

Updated Date - 2020-03-29T08:57:58+05:30 IST