కోడి పందేలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-01-16T05:29:58+05:30 IST

సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట జోరుగా సాగాయి. పలుచోట్ల పోలీసులు దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో కోడి పుంజులను, నగదును స్వాధీనం చేసుకున్నారు.

కోడి పందేలపై పోలీసుల దాడులు
రాంబిల్లి పోలీసులు పట్టుకున్న పందెం రాయుళ్లు, కోడి పుంజులు

పలువురి అరెస్టు

పదుల సంఖ్యలో కోడి పుంజులు,  వేలాది రూపాయలు స్వాధీనం


సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి పందాలు, పేకాట జోరుగా సాగాయి. పలుచోట్ల పోలీసులు దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో కోడి పుంజులను, నగదును స్వాధీనం చేసుకున్నారు. 


రాంబిల్లి, జనవరి 15: మండలంలోని కొత్తూరులో కోడిపందాల శిబిరంపై గురువారం దాడిచేసి ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ వి.అరున్‌కిరణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏడు కోడిపుంజులు, రూ.4,100 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


పరదేశిపాకలులో...

కొయ్యూరు: మండలంలోని బంగారమ్మపేట పంచాయతీ పరదేశిపాకలులో కోడి పందాల శిబిరంపై మంప ఎస్‌ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గురువారం సాయంత్రం దాడి చేశారు. నలుగురిని అరెస్టు చేసి మూడు కోళ్లు, రూ.2860 నగదు స్వాధీనం చేసుకున్నారు.


జోగంపేటలో...

గొలుగొండ: మండలంలోని జోగంపేట తీర్థంలో శుక్రవారం కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి, నాలుగు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ ధనుంజయనాయుడు తెలిపారు. 


సీతానగరంలో...

అనకాపల్లిటౌన్‌: మండలంలోని సీతానగరం శివారులో జరుగుతున్న కోడిపందాలపై గురువారం సాయంత్రం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ డి.ఈశ్వరరావు తెలిపారు. ఐదు కోళ్లను, రూ.400 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


రోలుగుంట మండలంలో....

రోలుగుంట: మండలంలోని వివిధ గ్రామాల్లో కోడి పందాల శిబిరాలపై మూడు రోజుల నుంచి దాడులు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. కుసర్లపూడి, ఎం.కె.పట్నం, అర్ల గ్రామాల్లో కోడి పందాలు ఆడుతున్న 20 మందిని అరెస్టు చేశామని, 11 కోడి పుంజులు, రూ.10,500 నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు.


కోటవురట్ల మండలంలో....

కోటవురట్ల: మండలంలోని యండపల్లి, చౌడువాడ గ్రామాల్లో కోడిపందాలపై ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. యండపల్లిలో  ఏడుగురి అరెస్టు చేసి రెండు కోళ్లు, రూ.3.300 నగదును స్వాధీనం చేసుకున్నారు. చౌడువాడలో 12 మందిని అరెస్టు చేసి, రెండు కోళ్లను, రూ.12,440 నగదు స్వాధీనం చేసుకున్నారు.


పేకాట, కోడి పందాల శిబిరాలపై....

ఎలమంచిలి/ ఎలమంచిలి రూరల్‌: మునిసిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెరువుపల్లిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి, రూ.5019 నగదు, పద్మనాభరాజుపేటలో ఐదుగురిని అరెస్టు చేసి, రూ 3,538 నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పెదపల్లిలో ముగ్గురిని అరెస్టు చేసి రూ.8,320 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలమంచిలి పట్టణం, ఎర్రవరం సమీపంలో రెండు చోట్ల కోడి పందాలపై దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఐదు కేసులకు సంబంధించి 17 మందిని అరెస్టు చేసి, రూ.16,877 నగదును స్వాధీనం చేసుకున్నట్టు రూరల్‌, పట్టణ ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, నరసింగరావు తెలిపారు.


Updated Date - 2021-01-16T05:29:58+05:30 IST