కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదు

ABN , First Publish Date - 2022-04-13T21:03:59+05:30 IST

కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో చిక్కుల్లో పడిన..

కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదు

బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో చిక్కుల్లో పడిన కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై  బుధవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఆయన పేరు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సంతోష్ పాటిల్ సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఉడిపి హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో సంతోష్ పాటిల్ మంగళవారం మృతి చెందడం సంచలనమైంది.


ఈశ్వరప్పతో పాటు ఆయన సిబ్బంది రమేష్, బసవరాజ్ నిందితులంటూ తన ఫిర్యాదులో ప్రశాంత్ పేర్కొన్నారు. హిండలగ గ్రామంలో రూ.4 కోట్లు విలువచేసే పనులను తన సోదరుడు చేశాడని, ఆ పనులకు సొంత డబ్బులు ఖర్చు చేయగా, బిల్లులు పెండింగ్‌లో ఉంచారని ఆయన తెలిపారు. సొమ్ములు విడుదల చేయాలని ఈశ్వరప్పను పలుమార్లు సంతోష్ కలిసి విజ్ఞప్తి చేశారని, అయితే ఆయన సహచరులైన బసవరాజ్, రమేష్‌లు 40 శాతం కమిషన్ అడిగారని ఆరోపించారు.


కాగా, పాటిల్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని సాక్షాలను పరిశీలిస్తోంది. పాటిల్ అనుమానాస్పద మృతి సంచలనం కావడంతో ఈశ్వరప్పను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు చేశారు.


ఈశ్వరప్ప అరెస్టుకు డీకే డిమాండ్

ఈశ్వరప్పను గవర్నర్ తొలగించాలని, అతన్ని అరెస్టు చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారంనాడు డిమాండ్ చేశారు. తన సొంత మనుషులతో 40 శాతం కమిషన్‌కు డిమాండ్ చేసిన మంత్రిపై అవినీతి కేసు నమోదు చేయాలన్నారు.

Updated Date - 2022-04-13T21:03:59+05:30 IST