పోలీస్‌.. ఓవరాక్షన్‌..!

ABN , First Publish Date - 2022-08-07T06:32:17+05:30 IST

ప్రజాప్రతినిధులుగా ఉన్న వైసీపీ నేతల వికృత చేష్టలపై తెలుగు మహిళలు, తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు.

పోలీస్‌.. ఓవరాక్షన్‌..!
ఒంగోలులోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు

వైసీపీ నేతల వికృత చేష్టలపై టీడీపీ నిరసన

తెలుగు మహిళలనుఅడ్డుకున్న పోలీసులు 

ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం 

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 6 : ప్రజాప్రతినిధులుగా ఉన్న వైసీపీ నేతల వికృత చేష్టలపై తెలుగు మహిళలు, తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. టీడీపీ ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతోపాటు, మహిళా నేతలను పక్కకు లాగేశారు.  ఆసమయంలో ఒక్క మహిళా పోలీసు లేకపోగా, మగ పోలీసులు తెలుగు మహిళల జుట్టు పట్టుకుని లాగడంతోపాటు, చున్నీలు లాగేసి ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిని తెలుగు యువత, మహిళలు తీవ్రంగా ఖండించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. వివరాల్లోకెళితే.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌లు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఆ ముగ్గురు నేతల ఫ్లెక్సీలనుచింపివేయడంతోపాటు, చెప్పులతో కొట్టి కాల్చే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకున్న పోలీసులు మరింత రెచ్చిపోయి మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు, తెలుగు మహిళల మధ్య తోపులాట జరగ్గా, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును తప్పుబట్టిన టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో అవంతి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు వ్యవహారంపై సీఎం సరైన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆ పార్టీ అధినేత మౌనంగా ఉన్నందువల్లనే నేడు ఎంపీ మాధవ్‌ బరితెగించారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి సభ్యత, సంస్కారం లేని ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి, రాజీనామాలు చేయించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాళం నరసమ్మ, తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి బీరం అరుణారెడ్డి, నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత, మేరీ రత్నకుమారి, గంగవరపు పద్మ, ముత్తన శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ అంబూరి శ్రీనివాసరావు, నావూరి కుమార్‌ పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-07T06:32:17+05:30 IST