శంషాబాద్ ప్రమాదానికి కారకులను గుర్తించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-04-19T22:06:15+05:30 IST
శంషాబాద్ ప్రమాదంపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రమాదానికి
శంషాబాద్: శంషాబాద్ ప్రమాదంపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రమాదానికి కారకులైన వారిని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో కానిస్టేబుల్ గిరిప్రసాద్, హోంగార్డ్ సంగమేశ్వర్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో గిరిప్రసాద్, సంగమేశ్వర్, మల్లేశ్ నిన్న యాదాద్రి వెళ్లారు. ఓఆర్ఆర్ మీదుగా ముగ్గురు స్నేహితులు శంషాబాద్ వచ్చారు. మార్గమధ్యలో ముగ్గురు స్నేహితులు మద్యం తాగారు. మద్యం మత్తులో కూలీలతో వస్తున్న లారీని గిరిప్రసాద్ ఢీ కొట్టాడు. కారుపై గతంలో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో చలాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హోంగార్డు మద్యం తాగినట్లు పోలీసులు తేల్చారు. గిరిప్రసాద్ రక్తనమూనాలను పోలీసులు సేకరించారు.
అసలేం జరిగింది?
శంషాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మద్యం మత్తు, అతివేగం దినసరి కూలీల ప్రాణాలు మీదకు తెచ్చింది. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకొని ఇంటికి లారీలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టింది. దీంతో లారీలో ప్రయాణిస్తున్న కార్మికులు దానికింద పడి నలిగిపోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ఓ కానిస్టేబుల్, హోమ్ గార్డ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరు సమీపంలో దావత్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ మత్తులో లారీని ఢీ కొట్టినట్టు విచారణలో తేలింది.