పొలాల్లో 19 ఏళ్ల యువతి శవం.. అత్యాచారం జరగలేదని పోస్ట్మార్టం రిపోర్ట్.. టెక్నాలజీతో అసలు కథేంటో తేల్చిన పోలీసులు
ABN , First Publish Date - 2021-12-27T21:43:57+05:30 IST
ఆ యువతి వయసు 19 ఏళ్లు. ఓ రోజు పొలంలో స్థానికులకు ఆమె శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు
లక్నో: ఆ యువతి వయసు 19 ఏళ్లు. ఓ రోజు పొలంలో స్థానికులకు ఆమె శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. యువతిపై అత్యాచారం జరగలేదని రిపోర్ట్లో స్పష్టమైంది. అయితే టెక్నాలజీతో పోలీసులు అసలు కథేంటో తేల్చేశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..
హర్దోయ్ ప్రాంతానికి చెందిన కమల, నరేంద్ర దంపతులకు 19 ఏళ్ల కూతురు ప్రతిభ ఉంది. ఆమె స్థానిక కాలేజీలో చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. తరుచూ ఫోన్ మాట్లాడుతూ ఉండేది. దీంతో తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించి, మాట్లాడకూడదని బెదిరించారు. అయినా ప్రతిభ వినకుండా ఫోన్లు మాట్లాడుతూనే ఉండేది. కూతురు వల్ల తమ పరువు పోతుందేమోనని భయంతో ఈ నెల 22న కమల, నరేంద్ర కలిసి ప్రతిభ గొంతు కోసి హత్య చేశారు. ఆమె ముఖం, మెడపై దాడి చేయడం వల్ల ఎముకలు విరిగిపోయి ఆ యువతి మృతి చెందింది.
హత్య తర్వాత కమల తనతో సన్నిహితంగా ఉండే విపిన్, రాంనరేష్లను పిలిపించుకుంది. వారి సహాయంతో కూతరు మృతదేహాన్ని పొలంలో పడేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిభను హత్య చేసి తల్లిదండ్రులు ఏమీ ఎరుగనట్లు తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో యువతిపై అత్యాచారం జరగలేదని స్పష్టమైంది. అయితే ఘటనా స్థలంలో దొరికిన కీ ప్యాడ్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా విపిన్ను గుర్తించారు. అతడిని విచారించగా జరిగిందంతా చెప్పాడు. వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.