Hyderabad : విదేశీల ఇళ్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి..
ABN , First Publish Date - 2021-12-03T17:10:49+05:30 IST
సొమాలియా, నైజీరియా, కాంగో దేశాలకు చెందిన విద్యార్థుల వీసా గడువు ముగిసిన్పప్పటికీ...
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్సిటీ, పీ అండ్ టీ కాలనీ, బండ్లగూడ ప్రాంతాలలో బుధవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారన్న సమాచారంతో విదేశీ విద్యార్థుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు డీసీపీ ఎన్.ప్రకాశ్రెడ్డి తెలిపారు. సొమాలియా, నైజీరియా, కాంగో దేశాలకు చెందిన విద్యార్థుల వీసా గడువు ముగిసిన్పప్పటికీ వారు కొవిడ్ ఇతర కారణాలను చూపుతూ వీసా గడువును పొడిగించుకుంటూ ఇక్కడే ఉంటున్నారని తెలిసిందన్నారు.
కార్డెన్ సెర్చ్లో 40 మంది వీసాలను పరిశీలించామని, అందులో ఏడుగురు విద్యార్థుల వీసా గడువు ముగిసినట్లు గుర్తించామన్నారు. ఫారిన్ రిజిష్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఓ) ముందు వారిని ప్రవేశపెట్టి తిరిగి వారి దేశాలకు పంపిస్తామన్నారు. ఈ దాడులలో పత్రాలు లేకుండ వాడుతున్న మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, వాటికి పత్రాలు తెచ్చాక విడిచిపెడతామన్నారు. ఏడు కేసులలో సంబంధం ఉన్న ఓ నైజిరియా దేశస్థున్ని కూడా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్ సందర్భంగా నైజిరియాకు చెందిన యూట్యూబ్ తెలుగు సింగర్ చార్లెస్ను కూడా తనిఖీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విదేశీయులు సీ ఫారం అప్లోడ్ చేశాకే ఇల్లు అద్దెకివ్వాలి..
ఇతర దేశాలకు చెందిన విద్యార్థులకు, ఉద్యోగులకు ఇల్లు అద్దెకు ఇస్తున్న యజమానులు వారి నుంచి సేకరించిన వివరాలను సీ ఫారంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్రెడ్డి తెలిపారు. అంతేకాకుండా విదేశీయుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వాలని సూచించారు. విదేశాలకు చెందిన విద్యార్థులు గడువు ముగిసినా మన దేశంలో, మన ప్రాంతంలో ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. విదేశాలకు చెందిన వారు డ్రగ్స్ తదితర కేసుల్లో పట్టుబడితే సమాచారం ఇవ్వని ఇంటి యజమానులను కూడా బాధ్యులను చేస్తామని ఈ సందర్భంగా డీసీపీ హెచ్చరించారు.