ఇంటి అద్దె ఇవ్వాలని ఒత్తిడి చేసిన 8 మంది యజమానులపై కేసు
ABN , First Publish Date - 2020-05-15T14:49:11+05:30 IST
కరోనా వైరస్ ప్రబలుతున్న ఆపత్కాలంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను బలవంతం చేసిన 8 మంది ఇంటి యజమానులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు....
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలుతున్న ఆపత్కాలంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను బలవంతం చేసిన 8 మంది ఇంటి యజమానులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో అద్దె చెల్లించాలని కిరాయిదారులను ఒత్తిడి చేయవద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీనగర్ లో విద్యార్థులు అద్దెఇళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. తమను అద్దె ఇవ్వాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు చేసిన ఫిర్యాదుల మేర తాము 8మంది ఇంటియజమానులపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఇంటి యజమానులకు నెలరోజుల పాటు జైలు శిక్ష లేదా రూ.200 ల జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి అద్దె డిమాండుపై ఫిర్యాదులు రావడంతో తాము కేసులు నమోదు చేశామని డీసీపీ విజయంత ఆర్యా చెప్పారు.