కొడుకు ముందే తండ్రిపై పోలీసు దాడి
ABN , First Publish Date - 2020-04-03T06:46:10+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తిని కన్న కొడుకు ముందే పోలీసులు చితకబాదారు. ‘‘వద్దు అంకుల్.. మా డాడీని కొట్టకండి’’ అంటూ ఆ చిన్నారి కంటతడి పెట్టినా కనికరించలేదు.
ట్విటర్లో స్పందించిన మంత్రి కేటీఆర్
వనపర్తి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తిని కన్న కొడుకు ముందే పోలీసులు చితకబాదారు. ‘‘వద్దు అంకుల్.. మా డాడీని కొట్టకండి’’ అంటూ ఆ చిన్నారి కంటతడి పెట్టినా కనికరించలేదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్విటర్లో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి చర్యలతో పోలీసులకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు. మంత్రి ట్విట్పై స్పందించిన వనపర్తి ఎస్పీ అపూర్వారావు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. సదరు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి పేరు మురళీ కృష్ణ అని, అతడి వాహనంపై పెండింగ్ చలానాలు ఉండటంతో అడిగామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతడు కానిస్టేబుల్ను తోసేయడంతో గొడవ జరిగిందని సీఐ సూర్యనాయక్ తెలిపారు.