ప్రజా ఉద్యమాలతోనే పోలవరం

ABN , First Publish Date - 2020-11-18T05:34:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాడి. దేశానికి ఆస్తి. దానిపై నీలినీడలు కమ్ముకోవడం దురదృష్టం. ఈ ప్రాజెక్టు కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు నీటి...

ప్రజా ఉద్యమాలతోనే పోలవరం

ఆంధ్ర ప్రదేశ్‌కు, ముఖ్యంగా భావితరాలకు జీవం లాంటి విభజన హామీల కోసం, పోలవరం కోసం రాజకీయ పక్షాలు ఏకం కాలేకపోవడం వారి భవితను దెబ్బతీయడమే. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగేటట్లు చూసి, 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలువ చేసే విధంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించాలి. కేంద్రం, ఇతరుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకుని గట్టి ఉద్యమం నిర్మించాలి. 


ఈ రాష్ట్రంలో ఒకరిని ఒకరు దూషించు కోవడం తప్ప, ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాడలేకపోవడం దురదృష్టకరం. ‘పాత ప్రభుత్వం ఇలా చేసింది, కొత్త ప్రభుత్వం ఇలా చేస్తోంది’ అని ఒకళ్ళ మీద మరొకరు బురద చల్లుకుంటుంటే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు మాత్రమే. బడ్జెట్ ఎంతైనా దాన్ని కేంద్రమే భరిస్తూ పోలవరం ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నిర్మించాలి. ఎన్నో బాధలు, అవమా నాలు ఎదుర్కొన్నా పట్టుబట్టి బ్యారేజ్ కట్టిన కాటన్ దొర స్ఫూర్తిని నేటి పాలకులు అందిపుచ్చు కోవాలి. 


ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ఒక జీవనాడి. దేశానికి ఆస్తి. దానిపై నీలినీడలు కమ్ముకోవడం దురదృష్టం. ఈ ప్రాజెక్టు కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు నీటి సదుపాయం కల్పించి, 23 లక్షల ఎకరాలను స్థిరీకరించి, 540 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు. దీనిపై ఆధారపడి ఉన్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలగు వాటితో అదనంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టు కొంతవరకు ముందడుగు వేసింది. అప్పట్లో ఎక్కువగా కాలువల నిర్మాణం మీదే దృష్టి పెట్టడం జరిగింది. మరోవైపు ఆ రోజుల్లోనే ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికంగా– గోదావరి జిల్లాల్లోనే– అపోహలు రేకెత్తించడానికి కొంతమంది యత్నించారు. వాటిని తొలగించడానికి అనేక సమావేశాలు జరిగాయి. మావంతుగా ఎంతో కృషి చేసాం. ఒకప్పుడు తూ.గో జిల్లాకు చెంది తర్వాత భద్రాచలం పరిధిలోకి మారిన 8 మండలాలను తిరిగి ఆ జిల్లాలోనే కలపాలని 2003 నుంచే మాలాంటి వారంతా డిమాండ్‌ చేశారు. అనేకమంది రాజకీయ నాయకులతో నేను ఈ విషయమై స్వయంగా మాట్లాడాను. విభజన జరిగేనాటికే, 8 మండలాలను, మొత్తం అన్ని ముంపు గ్రామాలను ఏపీలో కలపడానికి వీలుగా ఈ అంశాన్ని విభజన బిల్లులో చేర్చాలని డిమాండ్‌ చేయటంతోపాటు, వినతిపత్రాలు ఇచ్చాం. భాజపా అధ్యక్షుడి సలహాననుసరించి వెంకయ్యనాయుడును, ప్రొఫెసర్‌ శేషగిరిరావును కలిశాం. ఫలితంగా మొత్తం అన్ని ముంపు గ్రామాలను ఏపీలో కలిపేస్తున్నట్లుగా విభజన బిల్లులోనే పేర్కొన్నారు. తరువాత కేవలం పాలనాపరమైన సౌలభ్యం కోసం మధ్యలో ఉండే మరికొన్ని గ్రామాలను ఏపీలో కలిపితే అప్పుడే ఏదో మొత్తం ముంపు గ్రామాలు,- 7 మండలాలు కలిపేసినట్లు చెప్పుకోవడం సత్యదూరం. దుమ్ముగూడెం లాంటి మండలాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ముందటి ప్రణాళికల ప్రకారం పునరావాసం కల్పించాల్సి ఉంది. మునుపు తూ.గో జిల్లాకే చెందిన మరో 4 మండలాలను నేటికీ ఏపీలో కలపలేదు. అందువల్ల విభజన అనంతరం ప్రాజెక్టు ఆర్&ఆర్‌లో మళ్లీ కొన్ని మార్పులు జరిగాయి. అదే సమయంలో 2013 భూసేకరణ చట్టం 2014 నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర చట్టాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే, కనుక దాని అమలు సందర్భంగా మళ్లీ కొన్ని గణనీయమైన మార్పులు తప్పలేదు.


పోలవరం ప్రాజెక్టుకు 2014–-2016వరకు కేంద్ర నిధులు రాలేదు. మొదట్లో ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ నుంచి 100 కోట్లు మాత్రమే కేటాయించినప్పుడు అందరం ఉద్యమబాట పట్టాం. 2016 ఆఖరులో నీతిఅయోగ్ సలహాతో, అదీ నాబార్డు ద్వారా లోనుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఇప్పించి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం మొదలుపెట్టారు. పిపిఎకి ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటు జరిగింది. పాత కాంట్రాక్టర్ అసమర్థత వల్ల టెండర్‌ రద్దు చేసి కొత్త టెండర్ పిలుద్దామనుకున్నా మరింత జాప్యం జరుగుతుందనే యోచనతో, గడ్కరీ సూచన మేరకు ఇతరులకు హెడ్ వర్క్స్, పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత 2016 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అతివేగంగా సాగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ విధానం, కోవిడ్19 కారణంగా నిర్మాణం కొంతమేరకు ఆగినా, ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ వద్ద నేడు పని బాగానే ‍సాగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టిన 4వేల కోట్ల రూపాయలలో ఇప్పుడు 2,234.77 కోట్లు విడుదల చేయడానికే కేంద్రం ఇన్ని తిప్పలు పెడుతోంది. తాను పరిమితి  విధించుకున్న రూ.20,398.81 కోట్లకు ఒప్పుకుంటేనే అని షరతులు విధిస్తోంది. ఏ పార్టీకి చెందినా, ఏపీ అభివృద్ధి కాంక్షించే వారందరూ దీన్ని వ్యతిరేకించాలి. కానీ రాష్ట్రానికే చెందినా పోలవరాన్ని వ్యతిరేకించేవారిని రంగంలోకి దింపి ఈ ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నిర్మించాల్సిన అవసరం లేదనే విషప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా, తానే పూర్తి చేస్తానని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు  స్పష్టంగా హామీ ఇచ్చింది. ఒక గణతంత్ర రాజ్యం ఇచ్చిన సావరిన్ హామీ అది. తదుపరి కూడా పవర్ కంపోనెంట్ కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా తమదేనని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే  5235.87 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రాజెక్టు ఖర్చులో 10శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలనే భావంలో ఉండి ఈ మొత్తాన్ని వ్యయం చేసి ఉండొచ్చు. 


1946లో 208 అడుగుల ఎత్తులో నిర్మించదలచిన తర్వాత అనేక కారణాల వల్ల రకరకాల ఎత్తు ప్రతిపాదనలను పరిశీలించి చివరకు 150 అడుగులకు ప్రాజెక్టు ఎత్తును స్థిరీకరించారు. అయితే తాజాగా కేవలం 135/140 అడుగుల ఎత్తుకు గేట్లు ఆపరేట్ చేసే విధంగా నియంత్రించడం కోసం కోర్టులకు వెళ్లడానికి తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నట్లు, దానికి కొందరు కేంద్ర పెద్దల, కింద పెద్దల సహకారం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న గోదావరి ప్రవాహం మేరకు 135 అడుగుల లోపు కాలువల్లోకి నీరు మళ్లింపు కొంత మేరకు సాధ్యమే ఆయినా, ఎగువ రాష్ట్రాలు తమ ప్రాజెక్టులు పూర్తి చేసిన పక్షంలో అన్ని రోజులూ ఈ స్థాయిలో ప్రవాహం ఉండదు. అప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. రెండు కాలువలలోకి నీరు మళ్ళింపు పూర్తి సామర్థ్యంతో జరగాలంటే 150 అడుగుల ఎత్తున నీరు ఉంటేనే సాధ్యం. డ్యామ్‌ గోడలు ఆ ఎత్తుకు కట్టేస్తే ప్రాజెక్టు పూర్తైనట్లే, నీళ్లు మాత్రం పూర్తిస్థాయిలో నిలవ చేయడం మా పని కాదు అంటే ఎలా? కేవలం హెడ్‌వర్క్స్, కాలువలు 2022నాటికి పూర్తి అవ్వచ్చు. నిర్వాసితులకు న్యాయం చేసి 150 అడుగుల పూర్తి సామర్థ్యంతో నీళ్లు నిల్వ చేయగలిగితేనే ప్రాజెక్టు పూర్తి అయినట్లు. ఉట్టి గోడలు కట్టి, నీరు పూర్తిసామర్థ్యంతో నిలువ చేయకుండా ప్రాజెక్టు పూర్తి అయిపోయిందంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ బహుళార్థక సాధక ప్రాజెక్టును, ఓ పెద్ద బ్యారేజ్‌గా మార్చేసి తూతూ మంత్రంగా ఆర్‌ అండ్‌ ఆర్‌కి ఇంకో రూ.5000కోట్లు ఇచ్చి సరిపెట్టే కుట్రలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని దెబ్బతీయడమే అవుతుంది.


పోలవరం ప్రాజెక్టులో కాలువల ద్వారా ఒనగూడే సాగు, తాగు నీటి ప్రయోజనాలకు అదనంగా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి: 1) ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి-అనుబంధ ప్రాజెక్టులు, 2) కుడికాలువ ద్వారా ఎన్‌ఎస్‌పి కుడికాలువ ఆయకట్టుకు స్థిరత్వం, బొల్లెపల్లి రిజర్వాయర్, ప్రకాశం జిల్లా ద్వారా సోమశిలకి నీటి తరలింపు, 3) సాగర్ కింద ఆయకట్టుకు కొంత సప్లిమెంటేషన్ ఇచ్చి ఆ నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు వాడుకోవడం వగైరా. 150 అడుగుల ఎత్తు వరకు ప్రాజెక్టులో నీళ్లు నిలువ చేయలేకపోతే, ఈ ప్రయోజనాలన్నీ చాలావరకు దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రాజెక్టుకున్న 194 టిఎంసిల సామర్థ్యంలో ప్రాజెక్టు డెడ్ స్టోరేజి 119 టిఎంసిలు. అది 135 అడుగుల లోపులో ఉంటుంది. అదే పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 135–-150 మధ్యలో ఉంటుంది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీటి మళ్ళింపు జరిగితే గోదావరి డెల్టా ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గినా ఫర్వాలేదు అని సన్నాయి నొక్కులు నొక్కేవారు తెలివిగా కోస్తాజిల్లాల మధ్యనే ఉత్తరోత్తరా విద్వేషాలు రెచ్చగొట్టడానికి పన్నే మరో కుట్ర కాదా ఇది? అలా జరిగితే 960 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం కూడా బాగా దెబ్బతింటుంది. ఇక ఎత్తిపోతలకు వినియోగించే విద్యుత్ బిల్లులను ఎదురు కట్టాల్సి ఉంటుంది. 


ఎందుకనో ఆంధ్రులకు పోరాడకుండా ఏమీ రాలేదు. అమరజీవి ఆత్మత్యాగం, అనేకమంది బలిదానం వల్ల ఆంధ్రరాష్ట్రం వచ్చింది. విశాఖ ఉక్కు కోసం కూడా పోరాటాలు తప్పలేదు. అలాగే ప్రత్యేక ఆంధ్ర కావాలని వందలాదిమంది 1971-–72లో బలిదానం చేస్తే ఉమ్మడి రాజధానిపై కొన్ని హక్కులు వచ్చాయి. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తే, అలాగే విభజన జరిగితే ఏమి కావాలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నుంచి మంత్రుల బృందాల వరకూ డిమాండ్ చేస్తే కొన్ని హక్కులు వచ్చాయి, విభజన హామీల కోసం ఉద్యమిస్తే ఆ వచ్చిన 15శాతమన్నా అమలవుతున్నాయి. కొవిడ్19 వల్ల విభజన హామీల సాధనా ఉద్యమం కుంటుపడింది తప్ప ఆగే సమస్యే లేదు. కొవిడ్ ముందు కూడా, ఈ ప్రాజెక్టుకు నిధులు, విభజన హామీల అమలు కోసం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఇతర మంత్రులను కలిసి డిమాండ్ చేశాం. వారు అప్పుడు చెప్పినదానికి ఇప్పుడు ఆర్థికశాఖ చేస్తున్న దానికి సంబంధమే లేదు. మొన్ననే రైతు సంఘాల నేతలతో కలిసి పిపిఎకి వినతిపత్రం కూడా ఇచ్చాం. 


ఈ రాష్ట్రంలో ఒకరిని ఒకరు దూషించుకోవడం తప్ప, ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాడలేకపోవడం దురదృష్టకరం. ‘పాత ప్రభుత్వం ఇలా చేసింది, కొత్త ప్రభుత్వం ఇలా చేస్తోంది’ అని ఒకళ్ళ మీద మరొకరు బురద చల్లుకుంటుంటే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు మాత్రమే. 2017–-18 ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించిన 55వేల కోట్ల అంచనాలను ఆమోదించాలి. లోపాలు జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, బాధ్యులను శిక్షించాలి. అది వేరే. బడ్జెట్ ఎంతైనా దాన్ని కేంద్రమే భరిస్తూ పోలవరం ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నిర్మించాలి. ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొన్నా పట్టుబట్టి బ్యారేజ్ కట్టిన కాటన్ దొర స్ఫూర్తిని నేటి పాలకులు అందిపుచ్చుకోవాలి. 


నేడు అత్యంత ముఖ్య సమస్య వచ్చినప్పుడు కుల, మత, జిల్లాల తంపులు పెట్టడం, పోరాడేవారికి తోకలు కట్టడం సరి కాదు. తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం అందరూ ఏకమైతే, కేంద్రం ఏకంగా చట్టాన్నే సవరించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా భావితరాలకు జీవం లాంటి విభజన హామీల కోసం, పోలవరం కోసం రాజకీయ పక్షాలు ఏకం కాలేకపోవడం వారి భవితను దెబ్బతీయడమే. నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగేటట్లు చూసి, 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలువ చేసే విధంగా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించాలి. కేంద్రం, ఇతరుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను కలుపుకుని గట్టి ఉద్యమం నిర్మించాలి. లేదా ప్రజలే ఆంధ్ర ప్రదేశ్‌కు జరుగుతున్న వరుస అన్యాయాలపై ఉద్యమించాలి. 

చలసాని శ్రీనివాస్‌

Updated Date - 2020-11-18T05:34:37+05:30 IST